లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా క్రీడాలోకం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. క్రికెట్ సహా ఎన్నో క్రీడా కార్యకలాపాలు రద్దు కాగా.. మరొకొన్ని వాయిదా పడ్డాయి. కరోనా యూకేలో రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 60 వేల మందికి వైరస్ సోకగా.. 7 వేల మంది చనిపోయారు. కరోనా కారణంగా వచ్చేనెల 28 వరకు క్రికెట్ టోర్నీలు జరపొద్దని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ కాంట్రాక్టుల గురించి కాదు.. కోహ్లీతో గొడవ ఎందుకు వద్దనుకున్నామంటే: ఆసీస్ కెప్టెన్
ఈ సంవత్సరం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అడాలనుకున్నభారత్ సీనియర్ బ్యాట్స్మన్, టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార ఆశలు ఆవిరయ్యాయి. కరోనా కారణంగా ఈ ఏడాది తమ ఆటగాళ్ల కాంట్రాక్టులను సమీక్షించినట్లు తెలిపిన గ్లౌస్టర్షైర్ జట్టు యాజమాన్యం.. ఈ సీజన్లో పుజార తమ జట్టు తరపున ఆడబోడని ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి ఆరంభమయ్యే సీజన్ కోసం గ్లౌస్టర్షైర్ జట్టుతో కలిసి ఆరు మ్యాచ్లు ఆడేందుకు గత ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 12 నుంచి మే 22 వరకు నాలుగు రోజుల మ్యాచ్లు 6 ఆడాల్సివుండే.
చతేశ్వర్ పుజార కంటే ముందు చాలా కాలం కిందట భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ గ్లౌస్టర్షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 1995లో శ్రీనాథ్ ఆ జట్టు తరపున ఆడాడు. సుమారు 25 ఏళ్ల తర్వాత మరో భారత ఆటగాడు తమ జట్టు తరపున ఆడించాలనుకున్న సదరు కౌంటీ జట్టు ప్రణాళికలు కరోనా కారణంగా దెబ్బతిన్నాయి. పుజార గతంలో డెర్బీషైర్, యార్క్షైర్, నాటింగ్హామ్షైర్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో చతేశ్వర్ పుజార భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2012లో న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో తొలి అంతర్జాతీయ టెస్ట్ సెంచరీ (159) చేశాడు. పుజారా అత్యధిక టెస్ట్ స్కోర్ 206 నాటౌట్. పుజారా ఇప్పటివరకు భారత్ తరఫున 77 టెస్ట్ మ్యాచ్లు ఆడి 5,840 పరుగులు చేసాడు. ఇందులో 18 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 5 వన్డేలు ఆడి 51 పరుగులు చేసాడు.