కెరీర్లో 12వ డబుల్ సెంచరీని నమోదు
ఈ మ్యాచ్లో పుజారా 28 ఫోర్లు సాయంతో 204 పరుగులు చేశాడు. దీంతో తన కెరీర్లో 12వ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్ విజయ్ మర్చంట్ (11) రికార్డుని బద్దలు కొట్టాడు. సునీల్ గవాస్కర్, విజయ్ హజారే, రాహుల్ ద్రవిడ్లు పదేసి డబుల్ సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
రంజీ క్రికెట్లో సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్గా పుజారా
వీరిలో మూడు ట్రిఫుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్ పుజారానే కావడం విశేషం. అతడితో సమానంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాత్రమే మూడు ట్రిఫుల్ సెంచరీలు బాదాడు. ప్రస్తుతం రంజీ క్రికెట్లో పుజారా సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్లో పుజారా (355 బంతుల్లో 204) డబుల్ సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర భారీ స్కోరు చేసింది.
51 టెస్టులాడి 48.32 యావరేజితో 4,107 పరుగులు
తొలి ఇన్నింగ్స్ను ఆ జట్టు 553/9 వద్ద డిక్లేర్ చేయగా... చిరాగ్ జాని (108) సెంచరీ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 52 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే టెస్టు ఆటగాడిగా ముద్రపడిన పుజారా ఇప్పటివరకు 51 టెస్టులాడి 48.32 యావరేజితో 4,107 పరుగులు చేశాడు.
భారత్ తరుపున ఒక్క అంతర్జాతీయ టి20 ఆడలేదు
ఇందులో 13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో పుజారా అత్యధిక వ్యక్తిగత స్కోరు 206 పరుగులు. కాగా, భారత్ తరుపున 5 వన్డేలు మాత్రమే ఆడి 51 పరుగులు సాధించాడు. ఇక, భారత్ తరుపున ఒక్క అంతర్జాతీయ టి20 మ్యాచ్లో ఆడే అవకాశం పుజారాకు దక్కలేదు. ఇప్పటివరకు 158 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన పుజారా 41 సెంచరీలతో 12,538 పరుగులు చేశాడు.