
భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్కు సమయం దగ్గరపడుతుండడంతో అంతటా ఆసక్తి పెరుగుతోంది. ఈ సారి సిరీస్ హోరాహోరిగా సాగడం ఖాయమని కొందరు అంటుంటే, సఫారీ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇదే సరైన సమయం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టెస్ట్ సిరీస్ను ఉద్దేశించి ప్రధానంగా టీమిండియా పేస్ బౌలర్లపై భారత సీనియర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా పిచ్లపై తమ పేస్ బౌలర్లే తమ బలం అని చెప్పుకొచ్చాడు. పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ రెండు ఇన్నింగ్స్లలో కలిపి తమ పేస్ బౌలింగ్ యూనిట్ 20 వికెట్లు తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
విదేశాల్లో తమ పేసర్లు ప్రతిసారి రాణిస్తున్నారని కొనియాడిన పుజారా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో తమ పేసర్లు బాగా ఆడారని, వికెట్లు బాగా తీశారని గుర్తుచేసుకున్నాడు. ఒక రకంగా అక్కడ తమ బౌలింగ్ యూనిట్ అంచనాలకు మించి రాణించిందని పుజారా కొనియాడాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లో తమ పేసర్లు ఒక్కో ఇన్నింగ్స్లో కనీసం 8 వికెట్లు తీశారని, అక్కడ టెస్టు మ్యాచ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అలాగే ప్రత్యర్థి జట్టులోని 20 వికెట్లు పడగొట్టగల సామర్థ్యం, అనుభవం తమ పేసర్ల దగ్గర ఉందని పుజారా చెప్పాడు.
మ్యాచ్లో పై చేయి సాధించడంపై తాము ఎక్కువగా ఆలోచించమని చెప్పిన పుజారా.. తమ గేమ్ ప్లాన్ను విజయవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నాడు. అలాగే దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు సిద్ధం కావడానికి తమకు తగినంత సమయం ఉందని పుజారా చెప్పాడు. ఈ సిరీస్ కోసం తమ కుర్రాళ్లు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారని తెలిపాడు. దక్షిణాఫ్రికాలో తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇది తమకు మంచి అవకాశమని పుజారా చెప్పుకొచ్చాడు.
కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఆరుగురు పేసర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ సౌతాఫ్రికా వెళ్లిన భారత జట్టులో ఉన్నారు. అయితే న్యూజిలాండ్తో స్వదేశంలో భారత్ ఆడిన టెస్టు సిరీస్లో షమీ, బుమ్రా ఆడలేదు. అయితే చివరగా 2018లో భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది. అప్పుడు ఇరు జట్ల మధ్య 3 టెస్టుల సిరీస్ జరిగింది. ఆ సిరీస్ను టీమిండియా 1-2తో కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు వెర్నాన్ ఫిలాండర్, కగిసో రబడాతో పాటు భారత బౌలర్ షమీ ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ సిరీస్లో 14 వికెట్లు పడగొట్టాడు. కాగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే తాజా టెస్ట్ సిరీస్ ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే సందర్భంగా మొదలుకానుంది.