
ఆదివారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో సాధించిన విజయాల ద్వారా ప్రస్తుతం సౌతాఫ్రికాతో సిరీస్కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లోని చాలా మంది ఆటగాళ్లు సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నారన్నాడు. తాము విదేశాల్లో ఎక్కడైనా గెలవగలమని చెప్పాడు. తమ బౌలింగ్, బ్యాటింగ్ లైనప్లకు విదేశాల్లో గెలవగల సామర్థ్యం ఉందని పుజారా చెప్పుకొచ్చాడు. బయోబబుల్ తమను మానసికంగా దృఢంగా ఉంచడంలో సహాయపడిందని తెలిపాడు.
విదేశీ పిచ్లపై పేస్ బౌలర్లను ఎదుర్కొవడం భారత జట్టుకు ఎప్పుడూ సవాల్తో కూడుకున్నదే అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉందని, ప్రపంచలోని అత్యుత్తమ పేసర్లు ఆ జట్టులో ఉన్నారని అన్నాడు. అయితే వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించాడు. అలాగే ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లలోని చాలా మంది గతంలోనే ఇక్కడ పర్యటించారని, అది తమకు కలిసొచ్చే అంశం అని పుజారా అన్నాడు. అనుభవజ్ఞులు కల్గిన ఆటగాళ్లతో సిరీస్కు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించాడు.
అనుభవంతో చాలా నేర్చుకుంటామని అన్నాడు. తమకు అత్యుత్తమ సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉన్నట్టు చెప్పాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా కొంత కాలంగా విదేశాల్లో మెరుగ్గా ఆడుతుందన్నాడు. సౌతాఫ్రికాలోనూ రాణించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. తాను మొదటి సారిగా 2011లో సౌతాఫ్రికాలో పర్యటించానని, అప్పుడు ఆ జట్టులో డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కట్ వంటి పేసర్లు ఉండేవారని గుర్తు చేసుకున్నాడు.
ఆ తర్వాతి కాలంలో వాళ్లతోపాటు ఏబీ డివిల్లియర్స్, డుప్లిసిస్, హషీమ్ ఆమ్లా, ఫిలాండర్ వంటి సౌతాఫ్రికా దిగ్గజాలు రిటైర్ అయిపోయారని గుర్తు చేశాడు. తాను సౌతాఫ్రికాలో 2011, 2013, 2017లో పర్యటించానని, ప్రస్తుతం మేనేజ్మెంట్ తన నుంచి ఏం ఆశిస్తుందో తనకు తెలుసని చెప్పాడు.
కాగా చివరగా 2017లో భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది. అప్పుడు ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది. ఆ సిరీస్ టీమిండియా 1-2 తేడాతో ఓడింది. ప్రస్తుత టెస్టు సిరీస్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. అలాగే హెడ్కోచ్గా రాహుల్ ద్రావిడ్కు ఇదే తొలి విదేశీ సిరీస్.