హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ భారత బ్యాట్స్మెన్ పుజారాకి 50వ టెస్టు కావడం విశేషం.
తన కెరీర్లో 50వ టెస్టు ఆడుతోన్న పుజారా ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతేకాదు భారత్ తరఫున 50 టెస్టుల్లో నాలుగు వేలకు పైగా పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా పుజారా అరుదైన ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 41.2వ ఓవర్లో దిల్రువన్ వేసిన బంతిని ఎదుర్కొన్న పుజారా రెండు పరుగులు తీశాడు.

తద్వారా టెస్టుల్లో నాలుగు వేల పరుగులను పూర్తి చేశాడు. 50 టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో పుజారా నాలుగో స్థానంలో నిలిచాడు. అంతకు ముందు సునీల్ గవాస్కర్(4,947), రాహుల్ ద్రవిడ్(4,315), వీరేంద్ర సెహ్వాగ్(4,103) 50 టెస్టుల్లోనే 4వేలకు పైగా పరుగులు సాధించారు.
ఆ తర్వాత 47.1వ ఓవర్లో పెరీరా వేసిన బంతిని ఎదుర్కొన్న పుజారా ఒక పరుగు తీసి హాఫ్ సెంచరీని సాధించాడు. ఇదిలా ఉంటే గురువారం 17 మందికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెటర్లు పుజారా, హర్మన్ప్రీత్ కౌర్లు కూడా ఉన్నారు.