
హైదరాబాద్: ఛటేశ్వర్ పుజారా టెస్టుల్లో అత్యంత అనుభవం కలిగిన ఆటగాడు. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో మాత్రం అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ముఖ్యంగా సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పుజారా ఔటైన తీరుని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నిలకడకు చిరునామాగా పేరుగాంచిన పుజారా రెండు ఇన్నింగ్స్లోనూ రనౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించి గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. ఇక, ఓవర్ నైట్ స్కోరు 35/3తో చివరి రోజు ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ ఆరంభంలోనే పుజారా వికెట్ను కోల్పోయింది.
రెండో ఇన్నింగ్స్లో పుజారా (19) పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో పుజారా ఓ ఊహించని రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్లోనూ రనౌటైన మొదటి భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు 25 మంది ఈవిధంగా ఔటయ్యారు.
టెస్టుల్లో నిలకడగా ఆచితూచి ఆడే పుజారా రెండో టెస్టు, రెండు ఇన్నింగ్స్ల్లో కీలక సమయంలో ఔట్ కావడంతో ఆ ప్రభావం జట్టుపై పడింది. కేప్టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ పుజారా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ కలిపి 30 పరుగులు మాత్రమే చేశాడు.