సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీతో చెలరేగాడు. రంజీట్రోఫీలో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా జార్ఖండ్పై తన క్లాస్ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17వ ద్విశతకాన్ని సాధించాడు. పుజారా (236*)తో పాటు ప్రేరక్ మన్కడ్ (99*), హర్విక్ దేశాయ్ (85) కూడా రాణించారు. దీంతో మూడో రోజు తొలి సెషన్ ముగిసేసరికి సౌరాష్ట్ర నాలుగు వికెట్లు కోల్పోయి 566 పరుగులు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 142 పరుగులకే కుప్పకూలింది. చిరాగ్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. జయదేవ్ ఉనద్కత్, ఆదిత్య చెరో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం సౌరాష్ట్ర 424 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే 35 ఏళ్ల పుజారా టీమిండియాకు గత కొంతకాలంగా దూరమయ్యాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అనంతరం పుజారా భారత జట్టులో చోటు కోల్పోయాడు.

యువకులకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సెలక్టర్లు పుజారాకు మొండిచేయి చూపించారు. అలాగే గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో విఫలమవ్వడం మరో కారణంగా నిలిచిందది. అయితే ఇటీవల సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా యువ బ్యాటర్లు విఫలమవ్వడంతో పుజారా, అజింక్య రహానె గురించి పెద్దఎత్తున చర్చ సాగింది.
సఫారీ పిచ్లపై సీనియర్లు లేని లోటు స్పష్టంగా కనిపించందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.పుజారా, రహానె తిరిగి జట్టులోకి తీసుకురావాలని సూచించారు. ఈ నేపథ్యంలో పుజారా డబుల్ సెంచరీ సాధించడం విశేషం. తన సత్తా ఏంటో బ్యాట్తోనే టీమిండియా సెలక్టర్లకు పుజారా సమాధానం చెప్పాడని నెట్టింట్లో కామెంట్లు వస్తున్నాయి.
కాగా, జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు చేరడంలో, అలాగే టెస్టు ర్యాంకింగ్స్ తిరిగి అగ్రస్థానానికి చేరడంలో టీమిండియాకు ఈ సిరీస్ కీలకం కానుంది. మరో రెండు వారాల్లో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పుజారా తిరిగి టీమిండియాకు రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.