
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా అవుటవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే కెప్టెన్ కేఎల్ రాహుల్ (10) పెవిలియన్ చేరడంతో పుజారా క్రీజులోకి వచ్చాడు. తన పద్ధతికి విరుద్ధంగా కొంత వేగంగా ఆడిన పుజారా.. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్ (20) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు.
ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ (24)తో కలిసి పుజారా ఇన్నింగ్స్ను నిలబట్టే ప్రయత్నం చేశాడు. అయితే అతన్ని తైజుల్ ఇస్లాం బోల్తా కొట్టించాడు. ఇస్లాం వేసిన బంతిని డిఫెండ్ చేసుకోవడానికి పుజారా ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్యాడ్, బ్యాటు రెంటినీ తాకిన బంతి ఫార్వర్డ్ షార్ట్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. అది నేలను తాకకముందే అక్కడ ఉన్న మొమినుల్ హక్ వేగంగా స్పందించాడు. చటుక్కున క్యాచ్ అందుకున్నాడు. అయితే ఆ క్యాాచ్ సరిగా క్యారీ అవలేదని పుజారా భావించాడు. దీంతో క్రీజులోనే నిలబడ్డాడు. థర్డ్ అంపైర్ చూసిన రిప్లేలలో బంతి నేలను తాకలేదని తేలింది. అది నేలను తాకడానికి ముందే మొమినుల్ హక్ క్యాచ్ పట్టేసినట్లు కనిపించింది.
ఈ సూపర్ క్యాచ్తో పుజారా వెనుతిరిగాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీతో ఆకట్టుుకన్న అతను.. ఈ ఇన్నింగ్స్లో 55 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పుజారా వెనుతిరిగిన తర్వాత రిషభ్ పంత్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే లంచ్ తర్వాత కోహ్లీ (24) కూడా పెవిలియన్ చేరాడు. తస్కిన్ అహ్మద్ వేసిన బంతిని ఆడే క్రమంలో కీపర్ నురుల్ హసన్కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు .అదే సమయంలో రిషభ్ పంత్ మాత్రం తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.