భారత టెస్టు జట్టు భవిష్యత్తు సారథి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అని సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. సుదీర్ఘ కాలం భారత జట్టును బుమ్రా నడిపిస్తాడని తెలిపాడు. బుమ్రా జట్టు మనిషి అని, తన ప్రదర్శన గురించి కాకుండా జట్టు లాభం గురించి ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ దూరమవ్వడంతో, టీమిండియాను బుమ్రా గొప్పగా నడిపించిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైన అనంతరం తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన భారత్ను బుమ్రా నడిపించిన తీరుపై ప్రశంసలు వచ్చాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో ఆల్రౌండ్ షోతో సత్తాచాటింది.

''బుమ్రా సుదీర్ఘ కాలం భారత కెప్టెన్గా ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంతగడ్డపై కఠిన సిరీస్ (న్యూజిలాండ్)ను ఎదుర్కొన్న అనంతరం, ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడిన విధానం అసాధారణం. బుమ్రాకు జట్టును నడిపించే సామర్థ్యం ఉంది. అతను టీమ్ మ్యాన్. అతన్ని చూడిండి.. తన గురించి మాత్రమే ఎప్పుడు మాట్లడడు. జట్టు గురించి, ఇతర ఆటగాళ్ల గురించే మాట్లాడతాడు''
''కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లకు సలహాలు అవసరం ఉండవు. దానిని బుమ్రా అంగీకరిస్తాడు. ఇక అనుభవజ్ఞులు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటాడు. అతను మంచి కెప్టెన్ అనడానికి ఇదే సంకేతం. అతను కిందిస్థాయి నుంచి పైకి వచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు. సాయం చేయడానికి ఆతృతగా ఉంటాడు. అతను ఎంతో మంచి వ్యక్తి. క్రికెట్ అవతల కూడా అతని వ్యక్తిత్త్వం వినయంగానే ఉంటుంది'' అని పుజారా పేర్కొన్నాడు.
కాగా, బుమ్రా నుంచి రోహిత్ టీమిండియా సారథి బాధ్యతలు తిరిగి అందుకున్నాడు. అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు నుంచి జట్టును నడిపించనున్నాడు. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ డే/నైట్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది.