హైదరాబాద్: గంగూలీ పూజారాపై ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టుల్లో చెతేశ్వర్ పుజారా ఎంతో కీలక ఆటగాడని.. ఈ విషయం ఎక్కువమంది గుర్తించలేరని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. జట్టులో అందరూ విరాట్ కోహ్లినే చూస్తారని..కానీ అతనితో పాటు విలువైన ఆటగాడు పుజారాను గమనించరని అతనన్నాడు.
'టెస్టుల్లో విరాట్ కోహ్లితో పాటు పుజారాకు మంచి రికార్డు ఉంది. పాత ఆటగాళ్ల మాదిరే అతని శైలి అందరి కంటే భిన్నం. కుదురుకుని నెమ్మదిగా పరుగులు చేస్తాడు. జట్టును గెలిపించే ఇన్నింగ్స్లు ఆడినా వాటిని ఎవరూ గుర్తించరు. ఉత్తమమైన జట్టుకెప్పుడూ మూడో నంబర్లో ఉత్తమ బ్యాట్స్మెన్ ఉంటాడు. రాహుల్ ద్రవిడ్ దీనికి ఉదాహరణ. ఇప్పుడు కూడా భారత్ ఉత్తమంగా ఆడుతోంది ద్రవిడ్ స్థానంలో పుజారా ఉన్నాడు. ఈ స్థానంలో వచ్చే ఆటగాళ్లు కొత్త బంతి మెరుపు పోగొట్టి తర్వాత ధాటిగా ఆడే వారికి బ్యాటింగ్ సులభం చేస్తారు. అందుకే ఈ జట్టులో పుజారా ఉండడం విరాట్కు చాలా మంచిది' అని దాదా అన్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, పూజారాలు ఒకే స్కూలు విద్యార్థులని పేర్కొన్నాడు. అదే తరహాలో మ్యాచ్ లనూ కోహ్లీలానే గెలిపిస్తున్నాడని తెలిపాడు. గంగూలీ మాటలకు స్పందించిన పూజారా ఇలా అన్నాడు.'గంగూలీ ఇప్పటికీ పాత ఫ్యాషన్నే ఇష్టపడుతుంటాడు. నేనూ అలాగే ముందు క్రీజులోకి అడుగుపెట్టి పరిస్థితులను గమనిస్తాను. ఆ తర్వాతే పరుగులు చేయడం మొదలుపెడతాను. కావాలని బౌండరీలు టార్గెట్ చేసుకోను. అవి సహజంగానే వస్తుంటాయి'అంటూ ముగించాడు.
పూజారా ఇప్పటి వరకూ వైట్ బాల్ మ్యాచ్లలో భారత్ తరపున ఆడలేదు. కానీ, అందుకోసం కూడా తాను సిద్ధంగానే ఉన్నానని ఈ సందర్భంగా తెలిపాడు. దీనికి సంబంధించి ఐదారేళ్లుగా లాఫ్టెడ్ షాట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు వివరించాడు. గంగూలీతో పాటు పూజారా, హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్లు బుధవారం జరిగిన 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.