
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశాడు. కొన్నిరోజుల క్రితం అతనిపై ఒక ప్రముఖ వార్తాసంస్థ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ వర్గాలు చేతన్ శర్మపై మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేయాలని చేతన్ నిర్ణయించుకున్నాడు. అతను పంపిన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జై షా ఆమోదించినట్లు తెలుస్తోంది.
తనపై జరిగిన స్టింగ్ ఆపరేషన్లో బీసీసీఐకి సంబంధించిన చాలా అంతర్గత వివరాలను చేతన్ శర్మ బహిర్గతం చేశాడు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం, బీసీసీఐలో గొడవలు తదితర అంశాలన్నింటిపై నోరు జారాడు. స్టార్ ఆటగాళ్లపై చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు అందరికీ షాకిచ్చాయి. ఫిట్గా లేకపోయినా ఇంజెక్షన్లు చేసుకుంటారని, డోపింగ్కు దొరక్కుండా ఏం చేయాలో వాళ్లకు తెలుసునని అన్నాడు. అలాగే గమకు కోహ్లీ నచ్చలేదని, అందుకే కెప్టెన్సీ నుంచి తొలగించామని బాంబు పేల్చాడు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత భారత క్రికెట్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పాలి.
ఈ క్రమంలో చేతన్ శర్మపై బీసీసీఐ పెద్దలు చాలా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేసే బాధ్యత సెలెక్షన్ కమిటీదే. దీని కోసం సెలెక్షన్ కమిటీ సమావేశం అవ్వాల్సి ఉంది. అయితే చేతన్ శర్మ అంత దారుణంగా నోరు జారిన తర్వాత ఈ సమావేశం సక్రమంగా జరుగుతుందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేసిన చేతన్ శర్మ.. ఈ లేఖను బీసీసీఐ సెక్రటరీ జై షాకు పంపించాడట. దానికి జై షా కూడా వెంటనే ఆమోదం తెలపడంతో సెలెక్షన్ కమిటీ చీఫ్గా చేతన్ శర్మ కెరీర్ ముగిసింది. ఈ పదవిలో మాజీ లెజెండ్ వెంకటేశ్ ప్రసాద్ను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి.