
నమ్మకం పోయింది..
ఫిబ్రవరి 14న ఈ స్టింగ్ ఆపరేషన్కు చెందిన వీడియో టీవీలో వచ్చిన తర్వాత చేతన్ శర్మపై బీసీసీఐ పెద్దలకు నమ్మకం పోయిందని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. వారితోపాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య కూడా చేతన్ శర్మపై గౌరవం కోల్పోయారని స్పష్టం చేశారు. 'ద్రావిడ్, రోహిత్, పాండ్యా అందరూ చేతన్పై నమ్మకం, గౌరవం కోల్పోయారు. సెలెక్షన్ మీటింగ్లో అతనితో కలిసి కూర్చొని తమ అభిప్రాయాలు చెప్పే పరిస్థితి లేదు. తన అతి వాగుడుకు చేతన్ మూల్యం చెల్లించుకున్నాడంతే' అని చెప్పారు.

ఇంటి దగ్గరే చర్చలు..
ఈ స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆటగాళ్లు పూర్తిగా ఫిట్లా లేకపోయినా.. ఇంజెక్షన్లు తీసుకొని మ్యాచులు ఆడతారని చెప్పాడు. అలాగే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో జస్ప్రీత్ బుమ్రాను ఆడించడంలో కూడా బోర్డు మీటింగ్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయని, తన మాట ఎవరూ వినలేదని అన్నాడు. టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య, పేసర్ ఉమేష్ యాదవ్, దీపక్ హుడా ముగ్గురూ కూడా రెగ్యులర్గా తన ఇంటికి వస్తుంటారని, తమ కెరీర్ల గురించి తనతో చర్చిస్తారని వెల్లడించాడు. తన ఇంట్లో జరిగిన చర్చలు ఇంక ఎక్కడా జరగవన్నాడు.

వీడియోలో షాకింగ్ కామెంట్స్..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య గొడవ గురించి కూడా చేతన్ శర్మ మాట్లాడాడు. వీళ్లిద్దరి మధ్య పెద్దగా గొడవలేం లేవన్న చేతన్.. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, కోహ్లీ మధ్య మాత్రం ఈగో సమస్యలు ఉన్నాయన్నాడు. కోహ్లీని వన్డే కెప్టెన్గా తొలగించడం బోర్డు తీసుకున్న నిర్ణయమని, కానీ గంగూలీ ఇది కావాలని చేశాడని కోహ్లీ అనుకున్నాడని చెప్పాడు. అలాగే రోహిత్ అంటే తమకు ఇష్టముంది కెప్టెన్ చెయ్యలేదని, కోహ్లీ మీద ఇష్టం లేకపోవడం వల్లనే చేశామని అన్నాడు. కాగా, గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ ఓడిన తర్వాత సెలెక్షన్ కమిటీ మొత్తాన్ని బీసీసీఐ రద్దు చేసింది. అయితే కొత్త సెలెక్షన్ కమిటీ ఏర్పాడిన తర్వాత మళ్లీ చీఫ్ సెలెక్టర్ పదవిని తిరిగిపొందాడు. ఇప్పుడు రాజీనామాతో అతని కెరీర్ ముగిసినట్లే.


Click it and Unblock the Notifications












