డర్బన్ : ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. శనివారం డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 57 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు సెంట్రల్ డిస్ట్రిక్స్ స్టాగ్స్ ను చిత్తు చేసి టోర్నీలో బోణీ కొట్టింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బద్రీనాథ్ (52 నాటౌట్ ; 42 బంతుల్లో 4X4, 2X6), అనిరుద్ధ శ్రీకాంత్ (42; 29 బంతుల్లో 5X4, 1X6) రాణించడంతో మొదట 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసిన చెన్నై తర్వాత సెంట్రల్ డిస్ట్రిక్స్ ను 94 పరుగులకే కట్టడి చేసింది. లక్ష్మీపతి బాలాజి (3/10), మురళీధరన్ (2/15), అశ్విన్ (2/28) సెంట్రల్ డిస్ట్రిక్స్ పతనానికి కారణమయ్యారు. బొలింజర్ , మోర్కెల్ చెరో వికెట్ పడగొట్టారు. సెంట్రల్ జట్టులో బ్రేస్ వెల్ (30; 28 బంతుల్లో 2X4, 1X6) ఒక్కడే కాస్తా రాణించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై ఆట ఆరంభంలో చప్పగా సాగింది. విజయ్ (19; 29 బంతుల్లో 1X4) చాలా మందకొడిగా ఆడాడు. హేడెన్ (0) పూర్తిగా నిరాశపరిచాడు. రైనా (4) విఫలమయ్యాడు. మరోవైపు సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంతో చెన్నై పది ఓవర్లకు 48 పరుగులు (3 వికెట్లకు) మాత్రమే చేయగలిగింది. అయితే విజయ్ ఔటయ్యాక బద్రీనాథ్ తో జతకట్టిన అనిరుద్ధ వెంటనే మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. మరోవైపు అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న బద్రీనాథ్ పది ఓవర్ల తర్వాత స్కోరు వేగాన్ని పెంచే బాధ్యతను తీసుకున్నాడు. మెక్ క్లెనగాన్ వేసిన 11వ ఓవర్లో చూడచక్కని ఫోర్ , సిక్స్ బాదాడు. అదే ఊపులో బ్రేస్ వెల్ వేసిన 14వ ఓవర్లో ఓ భారీ సిక్సర్ , వెంటనే థర్డ్ మన్ దిశగా స్త్టెలిష్ బౌండరీ కొట్టాడు. బద్రీనాథ్ తో పాటు అనిరుద్ధ కూడా రెచ్చిపోవడంతో చెన్నై స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. మాసన్ వేసిన 15వ ఓవర్లో అనిరుద్ధ వరుస బంతుల్లో సిక్స్ , ఫోర్ తో చెలరేగాడు. ఐతే అర్ధసెంచరీకి చేరువైన అనిరుద్ధ బ్రేస్ వెల్ బౌలింగ్ లో గ్రిగ్స్ కు క్యాచ్ ఇచ్చాడు. బద్రీనాథ్ తో కలిసి అతడు నాలుగో వికెట్ కు 8.93 రన్ రేట్ తో 73 పరుగులు రాబట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అల్బీ మోర్కెల్ (26 నాటౌట్ ; 15 బంతుల్లో 1X4, 2X6) కూడా భారీ షాట్ లు కొట్టడంతో చెన్నై స్కోరు 150 దాటింది. బద్రీనాథ్ 41 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.