త్వరలోనే స్పష్టత
ఐపీఎల్ టోర్నీని మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే 15వ సీజన్లో 10 జట్లు ఆడనున్నాయి. గతేడాదే కొత్త జట్లను చేర్చాలనుకున్నా.. అది సాధ్యపడలేదు. ఇక ఈ ఏడాది ఆరంభంలో రెండు కొత్త జట్లకు సంబంధించి టెండర్లను బీసీసీఐ పిలవాలనుకుంది.
అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో.. టెండర్ల ప్రక్రియ కూడా ఆగిపోయింది. అయితే కొత్త జట్లకు సంబందించిన ప్రక్రియను త్వరలోనే బీసీసీఐ ఫినిష్ చేయాలనుకుంటుంది. రెండు జట్లు రానున్న నేపథ్యంలో మెగా వేలం జరగనుంది.
మెగా వేలానికి ముందు ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశంను ప్రాంచైజీలకు బీసీసీఐ ఇవ్వనుందని గతంలో వార్తలు వచ్చాయి. మొత్తం నలుగురు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై బీసీసీఐ త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.
చెన్నై ధోనీని వదులుకోదు
'ఐపీఎల్ 2022లో రిటెన్షన్ పాలసీ ఉంటే.. మా మొదటి ప్రాధాన్యం ఎంఎస్ ధోనీకే. అయితే ముందుగా మనం రిటెన్షన్ పాలసీ నియమాలను తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం తెలియదు. ఆటగాళ్లను నిలుపుకోగలిగితే.. ధోనీని ముందుగా ఎంచుకుంటాం. కచ్చితంగా చెబుతున్నా మహీ వచ్చే ఏడాది కూడా ఆడతాడు' అని చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు ఓ క్రీడా ఛానెల్లో చెప్పారు.
'ధోనీ లాంటి వ్యక్తిని ఏ జట్టు లేదా ఫ్రాంచైజ్ నిలుపుకోడానికి ఇష్టపడదు చెప్పండి. వచ్చేసారి రెండు కొత్త జట్లు రానున్నాయి. కాబట్టి పోటీ చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను ఒకటి మాత్రమే చెప్పగలను. రిటెన్షన్ కచ్చితంగా ఉంటుంది. అది నిజం. అయితే ఎన్ని రిటెన్షన్లు ఉంటాయన్నది తెలియదు. చెన్నై మాత్రం ధోనీని వదులుకోదు. ఓడకు కెప్టెన్ అవసరం ఉంది. మిగతా ఆటగాళ్ల ఎంపిక బీసీసీఐ నియమాల మీద ఆధారపడి ఉండనుంది' అని ఆ అధికారి పేర్కొన్నారు.
రిటెన్షన్ పాలసీపై ఆధారపడే
'గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ఐపీఎల్ 2022లో నేను ఆడేది లేనిది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. వచ్చే ఏడాది కొత్తగా రెండు జట్లు వస్తున్నాయి. ఈ సమయంలో నా రిటైర్మెంట్ గురించి కాదు చెన్నై జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాను. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలవడం ముఖ్యం కాదు. ఏ సీజన్లోనూ ఇబ్బంది పడకుండా ఉండే ఆటగాళ్లను తయారు చేయడం చాలా ముఖ్యం. రాబోయే 10 ఏళ్ల కోసం చెన్నై జట్టులో ఉండే ఆటగాళ్ల కోసం మేం ప్రస్తుతం చూస్తున్నాం' అని ఫైనల్ మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు.