
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. లీగ్ చరిత్రలో ప్లేఆఫ్స్కు చేరకపోవడం ఇదే తొలిసారి. 2016, 2017 సీజన్లు మినహాయిస్తే.. మిగతా పది సీజన్లలోనూ చెన్నై అదరగొట్టింది. ప్రతిసారి ప్లేఆఫ్స్, సెమీస్ లేదా ఫైనల్స్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది. మరీ ముఖ్యంగా 2010, 2011, 2018 సీజన్లలో ఛాంపియన్గా అవతరించింది. అయితే తొలిసారి ఇప్పుడిలా దారుణంగా విఫలమైంది. చెత్త ప్రదర్శనతో ఐపీఎల్ 2020ని 7వ స్థానంతో ముగించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చెన్నై రికార్డులు సృష్టించింది.
ఐపీఎల్ 2020లో అభిమానులు అత్యధికంగా ట్వీట్లు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై, రన్నరప్ చెన్నై తలపడ్డ సీజన్ ఆరంభ పోరు గురించి అభిమానులు విపరీతంగా ట్వీట్లు చేశారట.
అక్టోబర్ 4న జరిగిన ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్.. రెండు సూపర్ ఓవర్లు ఆడిన ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచు పైనా విస్తృతంగా ట్వీట్లు చేశారని సమాచారం. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అభిమానులు అత్యధిక ట్వీట్లు చేశారు. రాజస్థాన్ రాయల్స్ పోరులో పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ ఫీల్డింగ్ విన్యాసంపై సచిన్ చేసిన ట్వీటు ఈ సీజన్కే హైలైట్గా నిలిచింది. దాదాపు 23,000 సార్లు అభిమానులు దీనిని రీట్వీటు చేయడం గమనార్హం. మొత్తానికి ముంబై టైటిల్ గెలిచినా.. చెన్నై మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచింది.
నవంబర్ 10న జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ముంబై వరుసగా రెండో ఏడాది టీ20 లీగ్ ఛాంపియన్గా నిలవడమే కాకుండా.. ఐదోసారి విజేతగా అవతరించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. ప్రతి లీప్ సంవత్సరంలో ఓ కొత్త జట్టు ఛాంపియన్ అవుతోంది. 2008లో రాజస్థాన్ రాయల్స్.. 2012లో కోల్కతా నైట్ రైడర్స్.. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ కప్ కొట్టింది. ఈ ట్రెండ్ ప్రకారం 2020లోనూ కొత్త ఛాంపియన్ వస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ అందరిని అంచనాలను, అపోహలను కొట్టివేస్తూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఐదోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. బేసి సంవత్సరం, సరి సంవత్సరం, లీప్ సంవత్సరం, మహమ్మారి సంవత్సరం ఇలా ఏడాది ఏదైనా.. విజయం మాత్రం మాదేనని ముంబై నిరూపించింది.