ఐపీఎల్ 2026లో నేడు మరరో హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ తో తలపడబోతోంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గువాహటి స్టేడియం దీనికి వేదిక. మహేంద్ర సింగ్ ధోని లేని మొదటి గేమ్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కండరాల నొప్పి కారణంగా ప్రారంభ మ్యాచ్ లకు ధోని దూరం అయ్యాడు.
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 31 మ్యాచ్లు ఆడాయి. వీటిలో రాజస్థాన్ 15, చెన్నై 16 మ్యాచ్లలో విజయం సాధించాయి. హెడ్ టు హెడ్ ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆధిక్యతలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. గత సీజన్లో వీరి మధ్య జరిగిన రెండు మ్యాచ్లలోనూ రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. ఈ రెండూ కూడా ఛేజింగ్ ద్వారా దక్కించుకున్నవే. ఈ విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేయాలనే పట్టుదలతో ఉంది రాజస్థాన్.

అలాగే గత అయిదు మ్యాచ్లలోనూ రాజస్థాన్ ఆధిపత్యం కొనసాగింది. నాలుగింట్లో రాజస్థాన్ గెలిచింది. సీఎస్కే ఖాతాలో పడింది ఒక్క మాత్రమే మాత్రమే. ఈసారి యువ ఆటగాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సమీకరణాన్ని మార్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు పీయూష్ చావ్లా జట్టుకు హెచ్చరిక జారీ చేశాడు. వైభవ్ సూర్యవంశీ సీఎస్కేకు అతి పెద్ద ముప్పుగా పేర్కొన్నాడు.
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో షో టైమ్ అవుట్ లో తాజాగా మాట్లాడాడు పియూష్. వైభవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. ప్రారంభ ఓవర్లలోనే అతన్ని అవుట్ చేయాల్సి ఉంటుందని, లేదంటే భారీ స్కోర్ తప్పదని అంచనా వేశాడు. వైభవ్ ఓ ఆరేడు ఓవర్లు ఆడినా కూడా ఆటను సీఎస్కే నుండి దూరం చేయగలడని చెప్పాడు. అభిషేక్ శర్మ ఎంత ప్రమాదకర ఆటగాడో, అతన్ని అవుట్ చేయడానికి ప్రత్యర్థులు ఎటువంటి ప్లాన్లు వేస్తారో.. వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా అదే వైఖరి తప్పదని వ్యాఖ్యానించాడు.
వైభవ్ తొలిసారి ఆడినప్పుడు, మొదటి బంతినే సిక్సర్గా మారుస్తాడని ఎవరూ ఊహించలేదని చావ్లా గుర్తు చేశాడు. ఇప్పుడు జట్లు అతని ప్రమాదకరమైన ఆటను గుర్తించి అప్రమత్తంగా ఉన్నాయని, బౌలర్లు తమ లెంగ్త్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 2025 సీజన్లో వైభవ్ సూర్యవంశీ మొత్తం 24 సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు. ప్రతి ఐదో బంతికి ఒక సిక్సర్ బాది తన హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు.