ఐపీఎల్ 2026 సీజన్లో 5 సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే పరిస్థితి దారుణంగా తయారైంది. ఆడిన మొదటి మూడు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఎంఎస్ ధోనీ లేని స్పష్టంగా కనిపిస్తుండగా.. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వ లోపాలు, నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రూ.14.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను జట్టు సరిగ్గా ఉపయోగించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రశాంత్ వీర్ విషయంలో ఏం జరుగుతోంది?
రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెళ్లడంతో అతని స్థానాన్ని భర్తీ చేస్తాడని భావించి ఉత్తరప్రదేశ్కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ను భారీ ధరకు సీఎస్కే దక్కించుకుంది. అయితే గత రెండు మ్యాచ్ల్లోనూ ప్రశాంత్ వీర్కు బౌలింగ్ ఇచ్చేందుకు రుతురాజ్ గైక్వాడ్ సుముఖత చూపలేదు. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఛేదిస్తున్నా ప్రశాంత్ చేత ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకుంటున్నా రుతురాజ్ గైక్వాడ్ ప్రశాంత్ వీర్ను బౌలింగ్ వైపు చూడనివ్వలేదు.

సీఎస్కే 'కామెరాన్ గ్రీన్' ఇతనేనా?
ఈ పరిస్థితి కేకేఆర్ స్టార్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తోంది. రూ.25.20 కోట్లు పెట్టి కామెరూన్ గ్రీన్ను కొనుగోలు చేసినా కేకేఆర్ అతడిని బౌలర్గా వాడుకోవడం లేదు. అయితే కామెరూన్ గ్రీన్ విషయంలో గాయం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి క్లియరెన్స్ లేదని స్పష్టత ఉంది. కానీ ప్రశాంత్ వీర్ విషయంలో ఎలాంటి గాయం సమస్యలు లేవు. అయినప్పటికీ ఓ స్పెషలిస్ట్ స్పిన్ ఆల్రౌండర్ను కేవలం బ్యాటర్గా మాత్రమే ఆడించడం సీఎస్కే వ్యూహాత్మక తప్పిదమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎస్కే మేనేజ్మెంట్ పొరపాట్లపై చర్చ!
వరుసగా మూడు ఓటములు ఎదురైన నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం తమ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సంజు శాంసన్ చేరిక కూడా జట్టుకు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే మ్యాచ్ల్లోనైనా ప్రశాంత్ వీర్ వంటి ఆల్రౌండర్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని.. గెలుపుబాట పట్టాలని యెల్లో ఆర్మీ ఆశిస్తోంది. టోర్నీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి సీఎస్కే పుంజుకునే అవకాశం ఇంకా ఉంది.