
మిగిలిన అయిదు మ్యాచ్లు కీలకం
తొలి తొమ్మిది గేమ్లలో కేవలం మూడింట్లో మాత్రమే చెన్నై గెలుపొందింది. ప్రస్తుతం చెన్నై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ దశకు చేరుకోవాలంటే.. ఇక చెన్నై ముందు ఒకటే మార్గం ఉంది. ప్రతి మ్యాచ్ను ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే. అప్పుడే చెన్నైకి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. సీఎస్కే ప్లేఆఫ్ పోటీలో నిలవడానికి ఆ జట్టుకు మిగిలి ఉన్న ఐదు మ్యాచ్లను ఏమాత్రం విడిచిపెట్టొద్దు.

ధోనీ మళ్లీ కెప్టెన్ కావడం కొంత ఆశాజనకం..
ఎంఎస్ ధోనీ సీఎస్కే జట్టు పగ్గాలు మళ్లీ చేపట్టాడు. ఐపీఎల్ ప్రారంభ భాగంలో సీఎస్కే చాలా పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలి 4మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయింది. తర్వాత 4మ్యాచ్ల్లో రెండింట్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉండిపోయింది. ఈ క్రమంలో తన వైఫల్యాన్ని ఒప్పుకున్న రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. తిరిగి ధోనీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాడు. ఇక కెప్టెన్సీ చేపట్టిన ధోనీ ఆధ్వర్యంలో ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో బరిలోకి దిగిన చెన్నై జట్టు సత్తా చాటింది. 13పరుగుల తేడాతో సన్ రైజర్స్ను ఓడించింది.

సీఎస్కే ప్లేఆఫ్ వెళ్లడానికి ఇన్ని జరగాలి
1. ఇప్పటికి మూడు మ్యాచ్లలో గెలిచిన సీఎస్కే 6పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉంది. ఇంకా చెన్నైకి 5మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక ప్రతి మ్యాచ్లోనూ సీఎస్కే గెలవాల్సిన అవసరముంది. అప్పుడు ఆ జట్టు 16 పాయింట్లు సాధిస్తుంది. 16పాయింట్లు సాధిస్తే దాదాపు ప్లే ఆఫ్ చేరడం ఖాయం. గతంలో 16పాయింట్లు సాధించిన అన్ని జట్లు ప్లేఆఫ్ చేరుకున్నాయి.
2. ఈ సీజన్లో కాస్త కథ వేరేలా కన్పిస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 16పాయింట్లు సాధించి దాదాపు ప్లేఆఫ్ అవకాశాలు దక్కించుకుంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ఆ జట్టు ప్లేఆఫ్ బెర్త్ ఖాయమవుతుంది. గుజరాత్ ఆడింది 9 మ్యాచ్లే.. ఒక్క ఓటమి మాత్రమే ఆ జట్టు ఎదుర్కొంది. ఇక లక్నో కూడా 10 మ్యాచుల్లో 7 గెలిచి 14పాయింట్లతో ముందుంది. ఇంకా నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు జట్లు పూర్తిగా ఇతర జట్లను డామినేట్ చేస్తున్నాయి. లక్నో విజయాలకు అడ్డుకట్ట పడకపోతే.. కేవలం 2స్థానాలకే 7జట్లు పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇక 7 జట్లలో ఇప్పుడు సీఎస్కే చివర్లో ఉంది.
3. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆర్ఆర్ 12, సన్ రైజర్స్ 10పాయింట్లతో ఉన్నాయి. ఇవే కాకుండా పంజాబ్ కింగ్స్, కేకేఆర్, ఢిల్లీ జట్లలో ఏవైనా రెండు జట్లు వరుసగా పరాజయాలు చవిచూస్తే సీఎస్కేకు బెటర్ అవకాశాలుంటాయి. ముఖ్యంగా సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జయాపజయాలు సీఎస్కేకు చాలా అవసరం.. ఆ జట్ల విజయాలకు అడ్డుకట్ట పడాలి.
4. నెట్ రన్రేట్ తక్కువగా ఉండడంతో కొన్ని జట్లు ప్లేఆఫ్కు గతంలో దూరమైన సంగతి తెలిసిందే. సమాన పాయింట్లు ఉన్నా.. కొద్దీ నెట్ రన్ రేట్ తేడాతో జట్లు ఇంటిముఖం పట్టడాన్ని చూశాం. ఇక చెన్నై 6పాయింట్లతో కొనసాగుతుండగా.. నెట్ రన్ రేట్ మాత్రం ఘోరంగా ఉంది. -0.407తో నెగెటివ్లో ఉంది. దీన్ని బట్టి చెన్నై రాబోయే అన్ని మ్యాచుల్లో గెలవడమే కాకుండా ఒకట్రెండు మ్యాచ్లలో భారీ తేడాతో గెలవాల్సిన అవసరముంది.


Click it and Unblock the Notifications












