ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్.. సూపర్ విక్టరీ సాధించింది. మంగళవారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టింది. ఢిల్లీ కేపిటల్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని రుతురాజ్ సేన ఇంకా 15 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. మొన్నటివరకు అట్టడుగున ఉన్నఈ జట్టు.. చివరి అయిదు మ్యాచ్ లల్లో మూడింట్లో నెగ్గింది. టాప్ 4 జట్లకు చెమటలు పట్టిస్తోంది. లేట్ అయినా లేటెస్ట్ గా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.
ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో ట్రిస్టన్ స్టబ్స్- 38, సమీర్ రిజ్వీ- 40 పరుగులతో ఆదుకోకపోయివుంటే ఈ జట్టు పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారేది. వీరిద్దరు మినహా మరే బ్యాటర్ కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఏ ఒక్కరు కూడా 20కి మించి పరుగులు చేయలేదు. చెన్నై బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. ఒక్క అన్షుల్ కాంబోజ్ మినహా మిగిలిన బౌలర్లందరూ వికెట్లు పడగొట్టారు.

156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ప్రారంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6) మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత సంజు శాంసన్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజు శాంసన్కు తోడుగా కార్తీక్ శర్మ 31 బంతుల్లో 41 పరుగులు చేసి భారీ భాగస్వామ్యాన్ని అందించాడు.
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో అయిదు విజయాలతో 10 పాయింట్లు సాధించింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే టాప్ 4లోకి చేరుకుంటుంది సీఎస్కే. ఈ విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఎనిమిది పాయింట్లు ఉన్న ఢిల్లీ కేపిటల్స్ ఏడో స్థానానికి పడిపోయింది. ఈ సీజన్లో ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా మారుతున్న తరుణంలో సీఎస్కే ఫామ్లోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.