
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టును గాయాల సమస్య వేధిస్తుండగా.. ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా గాయపడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. తొడ కండరాలు పట్టేయడంతో రెండు వారాలపాటు అతడు ఐపీఎల్కు దూరమయ్యాడు. సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ముంబైతో మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని ధృవీకరించారు.
ముంబై ఇండియన్స్పై బౌలింగ్ వేస్తుండగా.. చాహర్ తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే కేదార్ జాదవ్, మిచెల్ శాంట్నర్ గాయం కారణంగా ఐపీఎల్కు దూరమైన సంగతి తెలిసిందే. రెండు వారాలపాటు చాహర్ కూడా ఐపీఎల్కు దూరం కావడం చెన్నై విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
'ధోనీ కంటే రోహిత్'యే:
2018 ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే జరిగిన తొలి మ్యాచ్లోనే ఓడిపోయిన చెన్నై రెండో సారి కాస్త జాగ్రత్తపడింది. శనివారం జరిగిన మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సీజన్లో పేలవ ఆటతీరు కనబరుస్తోన్న ముంబై.. ఎట్టకేలకు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 56 పరుగులతో నాటౌట్గా నిలిచిన రోహిత్ శర్మ జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో ముంబై ఊపిరి పీల్చుకోగా.. రోహిత్ మరో ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఛేజింగ్లో ఇప్పటి వరకూ ఎక్కువసార్లు అజేయుంగా హాఫ్ సెంచరీలతో.. జట్టును గెలిపించిన ఆటగాడిగా ఏబీ డివిలియర్స్ సరసన రోహిత్ నిలిచాడు. వీరిద్దరూ 13 సార్లు ఈ ఫీట్ సాధించగా.. ధోనీ, రైనా 12 సార్లు చొప్పున సాధించి రెండోస్థానంలో ఉన్నారు. 11 సార్లు ఈ ఫీట్ సాధించిన డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, గౌతమ్ గంభీర్ సంయుక్తంగా తర్వాతి స్థానంలో నిలిచారు.