
దుబాయ్: గత నెలలో కరోనా వైరస్ బారిన పడ్డ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) స్టార్ పేసర్ దీపక్ చహర్కు లైన్ క్లియర్ అయింది. శుక్రవారం నుంచి చహర్ మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభిస్తాడని సీఎస్కే జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వైద్య బృందం నుంచి కూడా దీపక్ చహర్కు క్లియరెన్స్ లభించింది. దీంతో చెన్నై శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది.
కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న దీపక్ చహర్కు రెండోసారి నిర్వహించిన పరీక్షలోనూ నెగెటివ్ రావడంతో అతను జట్టుతో కలిశాడు. సీఎస్కే, బీసీసీఐ వైపు నుంచి చహర్కు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయని, ఈ రోజు నుంచి శిక్షణ ప్రారంభిస్తాడని సీఈవో కాశీ విశ్వనాథన్ చెప్పారు. ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ను జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే యోచిస్తున్నదా అని ప్రశ్నకు చెన్నై సీఈవో స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అలాంటిదేమీ లేదని, అవన్నీ పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు.
'ఇప్పటికే మా జట్టులో విదేశీ ఆటగాళ్ల కోటా ఫుల్గా ఉంది. కాబట్టి జట్టులోకి మరో విదేశీయుడిని ఎలా తీసుకుంటామో నాకైతే తెలియదు. మా జట్టులో ఏ విదేశీ ఆటగాడు గాయం బారినపడలేదు' అని కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య లీగ్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచుకు దీపక్ చహర్ అందుబాటులో ఉండనున్నాడు.
గత ఏడాది డిసెంబర్లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్లో దీపక్ చహర్ గాయడ్డాడు. దీంతో అప్పటి నుంచి జట్టుకు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం తీసుకున్నాడు. అక్కడ ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. కరోనా కారణంగా ఐదు నెలలు బ్రేక్ రావడంతో ఇప్పుడు అతను వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు కరోనా నుంచి కూడా కోలుకున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచ్లాడిన చహర్.. 22 వికెట్లు పడగొట్టాడు. ఇదే అతని కెరీర్లో టర్నింగ్ పాయింట్. భారత్ తరఫున 10 అంతర్జాతీయ టీ20లు ఆడిన చహర్.. 7 ఎకనామితో 17 వికెట్లు పడగొట్టాడు. ఇక మూడు వన్డేలలో రెండు వికెట్లు తీశాడు.