
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం యూఏఈకి వెళ్లి ముందుగా ప్రాక్టీస్ ఆరంభించాలని భావించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు 11 మంది సీఎస్కే సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో.. అన్ని జట్ల కంటే చివరిగా ప్రాక్టీస్ మొదలెట్టింది. శుక్రవారం ప్రాక్టీస్ ప్రారంభించిన సీఎస్కే.. దాన్ని ముమ్మరం చేసింది. కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందడానికి సీఎస్కే ఆటగాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఆటగాళ్లకు ప్రాక్టీస్ ఆలస్యం కావడంతో సీఎస్కే నైట్ ప్రాక్టీస్ సెషన్ను కూడా ఆరంబించింది. ఆటగాళ్ల సాధనకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ను సీఎస్కే తన ట్వీటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. దీనికి 'నెట్. సెట్. గో' అనే క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు స్టార్ట్ద విజిల్స్, విజిల్ పోడు అనే ట్యాగ్లను కొద ఆడ్ చేసింది. కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందడానికి సీఎస్కే ఆటగాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా అర్ధమవుతుంది.
వీడియోలో ప్రధానంగా కెమెరాలన్నీ సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మీద ఫోకస్ చేశాయి. నెట్లో ధోనీ మొదటగా డిఫెన్స్ ఆడి.. ఆ తర్వాత గేర్ మార్చాడు. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్లలో భారీ షాట్లు ఆడాడు. మొదటగా ఫిట్నెస్కు సంబందించిన సాధన చేసిన మహీ.. ఆపై నెట్ సెషన్లో చమటోడ్చాడు. ఎంఎస్ ధోనీ, ఓపెనర్ షేన్ వాట్సన్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లాలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ఆటగాళ్లతో ముచ్చటిస్తూ ప్రాక్టీస్లో భాగమయ్యాడు.
ఐపీఎల్ 2020 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆఫ్స్పిన్నర్ హర్భజన్ సింగ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ టోర్నీకి దూరమవున్నట్లు ఇటీవల ప్రకటించాడు. ఇక స్టార్ ఆటగాడు సురేశ్ రైనా కూడా ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేడు. ఐపీఎల్కు యూఏఈ వెళ్లినా.. కొన్ని కుటుంబ కారణాలతో తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. అయితే సీఎస్కేతో రైనా జట్టుతో కలుస్తాడా.. లేదా అనేది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. అందుకు బలమైన కారణం.. రైనా ఇంటివద్ద ప్రాక్టీస్ చేయడమే. ఇక సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.