ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని తిరుప్పూర్లో క్రికెట్ అకాడమీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి 'సూపర్ కింగ్స్ అకాడమీ' అని పేరు పెట్టినట్లు కూడా వెల్లడించింది.
చెన్నైకి 460 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాలి స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్కే యాజమాన్యం తెలిపింది. భావి క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి వసతులు ఇక్కడ లభించనున్నాయి. అంతేకాదు, ఈ అకాడమీలో మొత్తం ఎనిమిది పిచ్లు ఏర్పాటు చేశారట.

ఇప్పటికే ఫ్లడ్లైట్లు ఇతరత్రా సదుపాయాలు కూడా పూర్తయిపోయాయి. ఆరేళ్ల నుంచి 23 సంవత్సరాల వయసున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఇక్కడ శిక్షణ తీసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రకటించిన సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ చాలా ఎగ్జయిట్ అవుతున్నట్లు తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న సత్తా ఉన్న కుర్రాళ్లను వెలికి తీయడమే తమ లక్ష్యమని విశ్వనాథ్ తెలియజేశారు.
'చెన్నై, సాలెం, హోసూర్, తిరుచ్చి, తిరునల్వేలిలో ఇప్పటికే సెంటర్లు రన్ అవుతున్నాయి. ఇప్పుడు తిరుప్పూర్లో కూడా అకాడమీ ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో యాలి స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విష్ణు గోవింద్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ సాయంతో తిరుప్పూర్కు అత్యుత్తమ కోచ్లను తీసుకువస్తామని, ఇది తమకు చాలా గొప్ప విజయమని గోవింద్ అన్నారు. 'ఈ అకాడమీ ద్వారా తిరుప్పూరుకు అత్యుత్తమ కోచింగ్ సదుపాయాలు వస్తాయి. తద్వారా మట్టిలో మాణిక్యాల వంటి ప్లేయర్లను బయటకు తీసే అవకాశం ఉంటుంది' అని వివరించారు.
తమిళనాడు వ్యాప్తంగా చెన్నై సూపర్ కింగ్స్ ఇలా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తోంది. తద్వారా రాష్ట్రంలో ఫ్యూచర్ క్రికెట్ స్టార్లను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ధోనీ వంటి లెజెండరీ ప్లేయర్లతో కూడా అకాడమీలో గెస్ట్ లెక్చర్లు ఇప్పిస్తారేమో? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.