హైదరాబాద్: చెన్నై సూపరికింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరు ఖరారైనట్లే. మరి సూపర్ బుల్స్ కెప్టెన్ ఎవరు.. అసలు ఈ జట్టేంటీ.. ఔను ఇదే ఇప్పుడు చెన్నైలో ట్రెండింగ్ న్యూస్. తమిళనాడు రాజధాని చెన్నై పేరిట 'చెన్నైయ్ సూపర్ బుల్స్' పేరుతో జల్లికట్టు జట్టు రెడీ అవుతోంది. రాష్ట్ర ప్రజలు అమితంగా మక్కువ చూపించే వివాదాస్పద క్రీడ జల్లికట్టుపై సొంతగా ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
తమిళనాడులో ఈ జల్లికట్టును పొంగల్ పండుగకు నిర్వహిస్తారు. మధురై, తిరుచ్చి, అలంగనల్లూర్, అవనియాపురం ప్రాంతాలతో సహా రాష్ట్రంలో పలుచోట్ల ఈ క్రీడకు మంచి ఆదరణే ఉంది.
ఇదొక సంప్రదాయ క్రీడ కావడంతో ఆ రాష్ట్ర రాజధాని పేరును జట్టు పేరుగా ఖరారు చేశారు. దీంతో చెన్నై సూపర్ బుల్స్ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉంది. తమిళనాడు జల్లికట్టు పెరవై, చెన్నై జల్లికట్టు అమైప్పు సంస్థల సారథ్యంలో ఈస్ట్ కోస్ట్ రోడ్డులో జల్లికట్టు ప్రిమీయర్ లీగ్ నిర్వహించనున్నారు. అయితే జంతు హక్కుల సంఘాలు నుంచి మాత్రం ఇప్పటి వరకు ఏ మాత్రం స్పందన లేదు.
2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో జల్లికట్టుపై తమిళనాడు ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించడంతో రాష్ట్రప్రభుత్వం దీన్ని అనుమతిస్తూ చట్టం చేసింది. జల్లికట్టుపై చట్టం చేయడాన్ని సవాల్ చేస్తూ 'పెటా'సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన సుప్రీం.. నాలుగువారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.