చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టింది. శనివారం నాడు జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పైన 97 పరుగుల భారీ విజయం సాధించింది. ఐపీఎల్ 8లో ఇప్పటి వరకు ఇది అతిపెద్ద విజయం. బ్రెండన్ మెక్కలమ్ అర్ధ సెంచరీతో రాణించగా, ధోనీ కూడా నిలదొక్కుకొని బ్యాటింగ్ చేయడంతో చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది.
భారీగా కనిపిస్తున్న లక్ష్యాన్ని అందుకునేందుకు ఏ మాత్రం పోరాటం సాగించని పంజాబ్ బ్యాట్స్మెన్ ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్ చేరారు. ఫలితంగా పంజాబ్ 20 ఓవర్లలో 9 వి కెట్లకు 95 పరుగులు మాత్రమే చేసి ఘోరపరాజయం పాలైంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించిన డ్వెయన్ స్మిత్, బ్రెండన్ మెక్కలమ్ మొదటి వికెట్కు 50 ప రుగులు జోడించారు.
13 బంతుల్లోనే 26 పరుగులు చేసిన విధ్వంసకర బ్యాట్స్మన్ స్మిత్ను అనురీత్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో చెన్నై మొదటి వికెట్ను కోల్పోయంది. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన రైనాతో కలిసి మెక్కలమ్ స్కోరును ముందుకు దూకించాడు. వీరు రెండో వికెట్కు 66 పరుగులు జోడించారు. మెక్కలమ్ 44 బంతుల్లో 66 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
కాసేపటికి రైనా (25 బంతుల్లో 29) రనౌటయ్యాడు. 144 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది. ధోనీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు సాధించింది. అప్పటికి ధోనీ (27 బంతుల్లో 41), జడేజా (11 బంతుల్లో 18) పరుగులతో నాటౌట్గా ఉన్నారు.
ఆ తర్వాత, పంజాబ్ ఏ దశలోను చెన్నైని ఓడించే దిశగా సాగలేదు. ఒకొక్కరూ వచ్చినంత వేగంగా పెవిలియన్కు పరుగులు తీశారు. సెహ్వాగ్ (1) వికెట్తో ఆరంభమైన వికెట్ల పతనం చివరి వరకూ కొనసాగింది. షాన్ మార్ష్ 10, జార్జి బెయలీ 1, డేవిడ్ మిల్లర్ 3, అక్షర్ పటేల్ 9, మిచెల్ జాన్సన్ 1, వృద్ధిమా న్ సాహ 15 చొప్పున పరుగులు చేసి అవుట్కాగా, ఓపెనర్ మురళీ విజయ్ ఒంటరి పోరాటం సాగించి 34 పరుగులు సాధించాడు. కాగా, ఆటగాళ్లు అంతకుముందు, నేపాల్, భారత దేశాల్లో భూకంపం కారణంగా మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.