
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో ఓ ప్లేయర్గా, ఓ కెప్టెన్గా ధోనీ అద్భుత ఫలితాలను రాబడుతోన్న సంగతి తెలిసిందే. మైదానంలో కూల్గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. అయితే, మైదానం బయట కూడా ధోనినే రియల్ హీరోనే అని అంటోంది ట్విట్టర్.
మేడే సందర్భంగా ధోనీ గ్రౌండ్ స్టాఫ్తో సరదాగా గడిపిన ఫొటోలను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఓ మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు సాయపడే ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్లో గ్రౌండ్ స్టాఫ్తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని కలిసి ఉన్న ఫోటోలను పోస్టు చేసింది. దీంతో ధోని సింప్లిసిటీని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సీజన్ ఐపీఎల్లో ధోనీ టాప్ ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్కింగ్స్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్గా పేరున్న ధోని, ఈ సీజన్లో ఇప్పటి వరకు చెన్నై ఆడిన అనేక మ్యాచ్ల్లో చివరి వరకూ నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఇటీవల ఐపీఎల్లో ఓ జట్టుకు కెప్టెన్గా 150కి పైగా విజయాలందించిన ఏకైక కెప్టెన్గా అరుదైన ఘనతను సాధించాడు.
తాజాగా ధోని ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. అదేంటంటే ఐపీఎల్ 11వ సీజన్లో ఇప్పటి వరకూ చివరి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ధోనీ ఎనిమిది మ్యాచ్లాడి మొత్తం 286పరుగులు సాధించాడు. అయితే ఇందులో 169 పరుగులు చివరి ఐదు ఓవర్లలోనే సాధించడం విశేషం.