టాస్ గెలిచి.. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించి..
టాస్ గెలిచి, ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించాడు ఇంగ్లండ్ టీమ్ కేప్టెన్ ఇవాన్ మోర్గాన్. ఏ ఉద్దేశంతో ఆయన ఆసీస్కు తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడో గానీ.. అది తప్పని కొన్ని ఓవర్లకే స్పష్టమైంది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ తమ ఫామ్ను కొనసాగించారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి రికార్డు స్థాయిలో 123 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఫించ్ మూడంకెల స్కోరును అందుకున్నాడు. డేవిడ్ వార్నర్ అర్ధసెంచరీ చేశాడు. చివరి ఓవర్లలో ఆసీస్ తడబడినప్పటికీ.. ఏడు వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చెప్పుకోదగ్గదిగా భావించే ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన ఇంగ్లీష్ టీమ్.. ఆరంభం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంది. వరుసగా వికెట్లను కోల్పోయింది. ఓటమిని చవి చూసింది. 221 పరుగులకు కుప్పకూలింది. బెన్ స్టోక్స్ ఒక్కడే ఆసీస్ బౌలర్లు సంధించిన నిప్పులు చెరిగే బంతులకు ఎదురొడ్డి నిలిచారు. 89 పరుగులు చేశాడు.
ఛేజింగ్ టీమ్ ఓడిపోవడం కొత్తేమీ కాదు..
లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగి ఆస్ట్రేలియాతో చేతిలో భంగపడింది ఇంగ్లండ్. ఆ జట్టు ఓడిపోయిన మ్యాచ్ల సంఖ్య మూడుకు చేరింది. ఈ మూడు ఓటములు కూడా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోనివే కావడం గమనార్హం. ఈ నెల 3న పాకిస్తాన్తో మ్యాచ్లో 348 పరుగుల టార్గెట్ను ఛేదించలేక ఓడిపోయింది ఇంగ్లండ్. 334 పరుగులు చేయగలిగింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. మరో ఛేజింగ్ ఓటమి శ్రీలంకతో. లంకేయులు విధించిన 232 పరుగులను కూడా ఛేదించలేక చేతులెత్తేసింది. 212 పరుగులు మాత్రమే చేసి, లంకేయులకు విజయాన్ని అందించింది. తాజా ఓటమి కూడా ఛేజింగ్ విషయంలోనే.
వరుసగా 17 మ్యాచులు..
ప్రస్తుత ప్రపంచకప్లో ఓ సరికొత్త సంప్రదాయానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. ప్రపంచకప్ ఆరంభంలో జరిగిన మ్యాచ్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. చివరి 17 మ్యాచ్లు మాత్రం తొలిసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు నిజంగా వరంలా మారినట్టున్నాయి. రెండోసారి బ్యాటింగ్కు దిగిన ప్రతి జట్టూ ఓడిపోతూనే వస్తోంది. వరసగా 17 మ్యాచుల్లో.. ఇలాంటి ఫలితమే వచ్చింది. మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. టాస్ గెలిచి, తొలుత టీమిండియాకు బ్యాటింగ్ను అప్పగించింది పాకిస్తాన్. దాని రిజల్ట్ ఏమిటో మనకు తెలిసింది. అత్యంత అవమానకర ఓటమిని చవి చూసింది పాకిస్తాన్. వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక్కటే దీనికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో విండీస్ విధించిన 322 పరుగులు భారీ లక్ష్యాన్ని సైతం బంగ్లాదేశ్ ఛేదించగలిగింది. అదీ 42 ఓవర్లలోనే సాధ్యం చేసుకుంది.