ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే..
శ్రీలంకలో పర్యటిస్తోన్న ఆస్ట్రేలియా వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ను కోల్పోయింది. ప్రత్యర్థి నిర్దేశించిన ఓ మోస్తరు టార్గెట్ను ఛేదించలేకపోయింది. లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. అయిదు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్లో వరుసగా మూడో పరాజయాన్ని చవి చూసింది ఆసీస్. సిరీస్ను 3-1 తేడాతో కోల్పోయింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే.. సిరీస్ను సొంతం చేసుకుంది లంక. తొలి మ్యాచ్లో ఓటమి తరువాత వరుసగా మూడింటినీ గెలిచింది. అయిదో మ్యాచ్ ఎల్లుండి షెడ్యూల్ అయింది.
258 పరుగులకు..
కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 258 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ నిరోషన్ డిక్వెల్లా ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. మూడో వన్డే సెంచరీ హీరో పాథుమ్ నిశ్శంక సైతం ఎక్కువ సేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. 13 పరుగులకే వెనుదిరిగాడు. కుశాల్ మెండిస్ కూడా తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. మూడో వికెట్ పడే సమయానికి శ్రీలంక 9.5 ఓవర్లల్లో 34 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సెంచరీతో చరిత్.. చరిత్ర
ఈ దశలో ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక క్రీజ్లో కుదురుకున్నారు. జట్టుకు 101 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో చరిత్ అసలంక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 106 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్లతో 110 పరుగులను చేశాడు. ఇది అతని తొలి సెంచరీ. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ దిగిన అసలంక.. బ్యాటింగ్ బ్యాక్బోన్గా నిలిచాడు. అటు ధనంజయ కూడా అర్ధసెంచరీ చేశాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లతో 60 పరుగులు చేసిన ధనంజయ మార్ష్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
తక్కువ పరుగులకే..
అతని తరువాత వచ్చిన బ్యాటర్లెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. కేప్టెన్ డాసన్ శనక-4, దునిత్ వెల్లలగె-19, చమిక కరుణరత్నె-7, జెఫ్రీ వాండెర్సె-0, మహీష్ తీక్షణ-0 పరుగులు చేశారు. వనిందు హసరంగ-21 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 49 ఓవర్లల్లో 258 పరుగులకు ఆలౌట్ అయింది లంక. అసలంక-ధనంజయ నెలకొల్పిన భాగస్వామ్యంతోనే ఈ స్కోర్ సాధ్యమైంది.
వార్నర్ ఒక్కడే..
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లల్లో 254 పరుగులకు ఆలౌట్ అయింది. సొంత గడ్డపై శ్రీలంక బౌలర్లు చెలరేగారు. ఆసీస్ ఇన్నింగ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్కడే భారీ స్కోర్ చేశాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ అయ్యాడు. 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆరోన్ ఫించ్-0, మిఛెల్ మార్ష్-26, మార్నుస్ లాంబుషెన్-14, అలెక్స్ క్యారీ-19, ట్రవిస్ హెడ్-27, గ్లెన్ మ్యాక్స్వెల్-1, కామెరాన్ గ్రీన్-13, పాట్ కమ్మిన్స్-35, మాథ్యూ కుహ్నెమన్-15 చేశారు.
చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన దశలో మాథ్యూ కుహ్నెమన్ వరుసగా ఫోర్లు బాదడం లంకేయులకు కొంత ఆందోళన కలిగించినప్పటికీ కథ సుఖాంతమే అయింది. మొత్తంగా ఆ ఓవర్లో 14 పరుగులు లభించాయి. లంక ఇన్నింగ్లో ఎనిమిది మంది బౌలింగ్ చేశారు. చమిక కరుణరత్నె, ధనంజయ, జెఫ్రీ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. డాసన్ శనక, దునిత్ వెల్లలగె, హసరంగ, మహీష్ తీక్షణ ఒక్కో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications












