చంద్రయాన్-3 మిషన్ను ఇస్రో విజయవంతంగా ముగించింది. చందమామ దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని భారతావని అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో క్రీడాకారులు కూడా ఉన్నారు.
ప్రముఖ క్రికెటర్లు ఈ చంద్రయాన్ విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రయాన్ మిషన్ ప్రోగ్రెస్ను టీవీలో చూసిన ధోనీ.. సహచరులతో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఈ వీడియోలో ట్యాంక్ టాప్, షార్ట్స్ వేసుకొని ఉన్న ధోనీ.. చాలా సటిల్గా చంద్రయాన్ విజయాన్ని ఆనందించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ధోనీని అందుకే కెప్టెన్ కూల్ అని పిలుస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన ఇన్స్టా హ్యాండిల్లో మరో వీడియో షేర్ చేశారు.
ఈ వీడియోలో ధోనీ కుమార్తె జీవా ధోనీ కూడా చంద్రయాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించింది. టీవీలో ఆ వార్త చూస్తూ ఆమె సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బుధవారం సాయంత్రం అనుకున్న సమయానికి చంద్రయాన్-3.. చందమామపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటి రోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా ఐదుసార్లు కక్ష్యను పెంచారు. ఐదో దశ పూర్తయిన తర్వాత చంద్రుడి దిశగా ప్రయాణించేందుకు దీన్ని ఆగస్ట్ 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా చంద్రుడికి చేరువ చేస్తూ వచ్చి.. ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ను ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడదీశారు. చివరిగా ల్యాండింగ్కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపారు.