చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయింది. భారత్ కూడా చందమామపై కాలుమోపింది. అదికూడా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు మోపిన తొలి దేశంగా అవతరించింది. దీనిపై పలువురు ప్రముఖ క్రికెటర్లు స్పందించారు. వారిలో సచిన్, విరాట్, రోహిత్, సూర్యకుమార్ వంటి వారు కూడా ఉన్నారు.
ఆ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. 'భారత్లోని బెస్ట్ను ఇస్రో రిప్రజెంట్ చేస్తుంది. ఎంతో కష్టపడినా కూడా ఎంతో వినయంగా ఉండే పురుషులు, మహిళలు కలిసి ఎన్నో అవాంతరాలను అధిగమించి మన త్రివర్ణ పతాకాన్ని అత్యున్నతంగా ఎగరేస్తున్నారు' అని ట్వీట్ చేశాడు.

అక్కడితో ఆగకుండా.. 'కె. శివన్, ఎస్. సోమనాథ్ల నేతృత్వంలో అత్యుత్తమంగా పనిచేసిన చంద్రయాన్-3 టీం విజయాన్ని భారత్ కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రతి హార్డ్ ల్యాండింగ్ కూడా.. ఆ తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్కు అవసరమైన పాఠాలు నేర్పుతుంది. అది చంద్రుడిమీదైనా, జీవితంలో అయినా' అని పేర్కొన్నాడు.
మరో టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన సంతోషాన్ని దాచుకోలేకపోయాడు. 'యే... చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ పూర్తిచేశాం. ఇస్రోతోపాటు ఈ చరత్రాత్మక మిషన్ను విజయవంతం చేయడానికి కృషి చేసిన అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మనం చంద్రుడిపై అడుగు పెట్టాం' అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
'చంద్రయాన్-3 టీంకు శుభాకాంక్షలు. ఈ దేశం గర్వించేలా చేశారు' అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేయగా.. 'చందమామ దక్షిణ ధృవంపై అడుగు పెట్టిన తొలి దేశం భారత్. ఈ మాట వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది. మనందరం గర్వించాల్సిన క్షణం ఇది. ఇస్రోకు కంగ్రాట్స్' అని రోహిత్ తన సంతోషం వ్యక్తం చేశాడు.
'చరిత్రాత్మకం.. మనం చంద్రుడిని చేరుకున్నాం. చంద్రయాన్-3 విజయవంతం అయినందుకు తోటి భారతీయులందరికీ శుభాకాంక్షలు. మన దేశం సాధిస్తున్న దినదినాభివృద్ధి ఎంతో గర్వించదగ్గ విషయం. మనం ఇంకా ఎన్నో సాధిస్తాం' అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. వీరితోపాటు రవీంద్ర జడేజా, డీకే, యుజ్వేంద్ర చాహల్ తదితరులు కూడా చంద్రయాన్-3 సక్సెస్పై ట్వీట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటి రోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా ఐదుసార్లు కక్ష్యను పెంచారు. ఐదో దశ పూర్తయిన తర్వాత చంద్రుడి దిశగా ప్రయాణించేందుకు దీన్ని ఆగస్ట్ 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా చంద్రుడికి చేరువ చేస్తూ వచ్చి.. ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ను ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడదీశారు. చివరిగా ల్యాండింగ్కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపారు.