
హైదరాబాద్: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ చివరి టెస్టులో చాలా అరుదైన రికార్డు నమోదైంది. ఇలా నమోదవడం టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఆరోసారి. ఈ మ్యాచ్లో రెండు జట్ల కెప్టెన్లు శతకాలు బాదారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 243 పరుగులు చేయగా, లంక కెప్టెన్ చండీమల్ 164 పరుగులు చేశాడు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్ట్ డ్రా కాగా, నాగ్పూర్లో జరిగిన రెండో టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 239 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇక ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్టులో పర్యాటక జట్టుపై భారత్ పై చేయి సాధించింది. ఈ మ్యాచ్లో ఇప్పటికే 370 పరుగుల లీడ్ సాధించిన భారత్ ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇవ్వనుంది. మ్యాచ్కు ఇంకా ఒక రోజు సమయం ఉండడంతో ఏమైనా అద్భుతం జరగితే తప్ప భారత విజయం ఖాయం.
ఇదిలా ఉంటే ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ను 246/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 163 పరుగులు కలుపుకొని పర్యాటక శ్రీలంక జట్టుకు 410 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో శిఖర్ ధావన్ (67), విరాట్ కోహ్లీ (50), రోహిత్ శర్మ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
మరోవైపు పుజారా (49) త్రుటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. శ్రీలంకలో బౌలర్లలో లక్మల్, గమాగె, పెరీరా, ధనంజయ, సందకన్ తలో వికెట్ తీసుకున్నారు. నాలుగో రోజు ఆట ముగిసేందుకు గాను ఇంకా 31 ఓవర్లు మిగిలి ఉన్నాయి.