
హైదరాబాద్: కరేబియన్ గడ్డపై వెస్టిండిస్తో జరిగే మూడో టెస్టుకు శ్రీలంక కెప్టెన్గా సురంగ లక్మల్ నియమితుడయ్యాడు. బాల్ టాంపరింగ్ కారణంగా శ్రీలంక రెగ్యులర్ కెప్టెన్ చండిమాల్ విండీస్తో మూడో టెస్టుకు దూరం కానున్న నేపథ్యంలో అతని స్థానంలో సురంగ లక్మల్ను కెప్టెన్గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. విండీస్తో టెస్టు మ్యాచ్కు వెటరన్ క్రికెటర్ రంగనా హెరాత్ను కెప్టెన్గా నియమించాలని ఎస్ఎల్సీ తొలుత భావించినా, అతను గాయం కారణంగా ఆఖరి టెస్టులో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాంతో చండిమాల్ స్థానంలో లక్మల్ను కెప్టెన్గా నియమించింది.
మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో వెస్టిండిస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు తనపై విధించిన టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ను సవాల్ చేసిన శ్రీలంక క్రికెట్ కెప్టెన్ చండిమాల్కు చుక్కెదురైంది. ఈ మేరకు మిచెల్ బెలాఫ్ నేతృత్వలోని ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిషన్ చండిమాల్ అప్పీల్ను కొట్టివేసింది.
శుక్రవారం నాలుగు గంటల పాటు చండిమాల్ను విచారించిన జ్యుడిషియల్ కమిషన్ చండీమాల్ అప్పీల్లో ఎటువంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. అంతేకాదు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఒక మ్యాచ్ సస్పెన్షన్తో పాటు మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా యథావిధిగా అమలవుతుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీలంక కెప్టెన్ చండీమాల్ ఓ తీపి పదార్థాన్ని ఉపయోగించి బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినట్లు గుర్తించిన మ్యాచ్ రిఫరీ అతడిపై ఓ టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. బాల్ను షైన్ చేసేందుకు కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించినట్టు ఐసీసీ విచారణలో వెల్లడైంది.
మ్యాచ్ వీడియో ఫుటేజీ పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జవగళ్ శ్రీనాథ్ మాట్లాడుతూ బంతిపై కృత్రిమ పదార్థాన్ని రాసినట్టు రివ్యూలో స్పష్టంగా కనిపించిందని అన్నాడు. దానికి లాలాజలం రాసి బంతిని మెరిపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించామని అన్నాడు.
ఐసీసీ నిబంధనావళిని అనుసరించి అతడిపై చర్యలు తీసుకున్నట్టు వివరించాడు. కాగా, తాను ఏ తప్పు చేయలేదని వాదించిన చండిమాల్.. రిఫరీ నిర్ణయంపై అప్పీల్కు వెళ్లాడు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిషన్.. చండిమాల్ అప్పీల్ను తిరస్కరించింది.