కోల్కత్తా: బీసీసీఐ అధ్యక్షుడు (లేట్) జగ్మోహన్ దాల్మియా తన కళ్లను దానం చేశారు. ఆయన కోరిక మేరకు కోల్కత్తాలోని 'వన్ముక్త ఐ బ్యాంక్'కు దాల్మియా నేత్రాలను అప్పగించినట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
శుశృక్త ఐ ఫౌండేషన్ అండ్ రీసర్స్ సెంటర్కు చెందిన ఓ విభాగమే ఈ వన్ముక్త ఐ బ్యాంక్. నేత్ర దానాల ద్వారా అంధత్వాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో దాల్మియా కొన్ని సామాజిక కార్యక్రమాలను చేపట్టారని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దాల్మియా చేపట్టిన ఈ కార్యక్రమాల పేర్లు 'క్రికెట్ ఫర్ లైఫ్ బియాండ్ డెత్', 'ఛాన్స్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్'.
బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి గుండె సంబంధిత సమస్యతో కోల్కత్తాలోని కేఎం బిర్లా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

స్నేహితుడిని కోల్పోయా: అరుణ్ జైట్లీ
బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత స్నేహితుడిని కోల్పోయానని జైట్లీ తెలిపారు. భారత క్రికెట్ను అత్యున్నత స్థాయికి చేర్చిన ఘనత దాల్మియాదే అని కొనియాడారు.
ఈ ఉదయం నిద్రలేవగానే దాల్మియా మరణ వార్త తెలిసిందని, తాను ఒక్కసారిగా షాక్కు గురయ్యానని చెప్పారు. గత నెలలో కోల్కత్తాలో దాల్మియాను చివరిసారి కలిశానని చెప్పిన ఆయన దాల్మియా మన మధ్య లేకపోవడం తీరని లోటు అని అన్నారు. ప్రస్తుతం అరుణ్ జైట్లీ హాంకాంగ్ పర్యటనలో ఉన్నారు.