యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఓటమి ఆ జట్టు కెప్టెన్తోపాటు హెడ్ కోచ్ కొంపముంచేలా ఉంది. ఇప్పటికే యాషెస్ సిరీస్ను ఇంగ్లండ్ 0-3 తేడాతో కోల్పోయింది. కనీసం ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా ఆ జట్టు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆ జట్టుపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల దాడి హెడ్ కోచ్ సిల్వర్ వుడ్, కెప్టెన్ జో రూట్పైనే ఎక్కువగా పడుతోంది. వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంకా కొందరైతే ఏకంగా టీం మొత్తాన్నే మార్చేయాలని వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ దిశగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా చర్యలు చేపట్టిందని వాదనలు వినిపిస్తున్నాయి. హెడ్కోచ్, కెప్టెన్ పనుల పట్ల బోర్డు అసంతృప్తిగా ఉందని సమాచారం. యాషెస్ సిరీస్ ముగియగానే వారిద్దరిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తప్పించనుందని అంటున్నారు. యాషెస్ సిరీస్ కాకుండా గతంలో సొంత గడ్డపై ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా ఇంగ్లండ్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయింది. మొత్తంగా 2021 ఏడాదిలో ఆ జట్టు వైఫల్యాలు కొనసాగాయి. ఆ ఏడాదిలో ఇంగ్లండ్ జట్టు కేవలం 4 టెస్ట్ మ్యాచ్లే గెలిచింది.
మొదటి వేటు జట్టు హెడ్కోచ్పైనే పడబోతుందని అంటున్నారు. హెడ్ కోచ్ సిల్వర్ వుడ్ స్థానంలో కొత్త కోచ్ను నియమించేందుకు ఈసీబీ చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. దీనికి తోడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్ ఇంగ్లండ్ కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే వెల్లడించాడు. భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టనే. అలాగే జోరూట్ను కూడా కెప్టెన్సీ నుంచి తప్పించనుందని సమాచారం. అతని స్థానంలో ఆల్రౌండర్ స్టోక్స్ను కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది.
అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అంత సాహసం చేయగలదా అనేది సందేహమే. ఎందుకంటే ప్రస్తుతం బ్యాటర్గా రూట్ టాప్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టు ఓటమికి రూట్ ఒక్కడినే బాధ్యుడిని కూడా చేయలేం. ఎందుకంటే ఇంగ్లండ్ బ్యాటింగ్లో చాలా కాలంగా రూట్ మినహా ఎవరూ అంతగా రాణించడం లేదు. దీంతో జట్టు ఓడుతూ వస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం కెప్టెన్గా తెరపైకి వస్తున్న బెన్స్టోక్స్ కూడా ఫామ్లో లేడు. ఈ సమస్యలన్నింటీ నేపథ్యంలో రూట్నే కెప్టెన్గా కొనసాగించిన ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.