హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ ఆడిన ఏకైక క్రీడాకారుడిగా యువరాజ్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల క్రితం 2000వ సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా యువరాజ్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
అదే టోర్నీలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్స్తో తొలిసారి యువీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2002, 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆడిన జట్టులోనూ యువరాజ్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు.

ఇప్పటి వరకు ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆడటం జరిగింది. 1998, 2004, 2006లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో వెస్టిండీస్కి చెందిన చంద్రపాల్, బ్రియాన్ లారా ఆడారు. తాజాగా యువరాజ్ సింగ్ వీరి సరసన చేరాడు.
అంతేకాదు ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్లలో అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా కూడా యువరాజ్ సింగ్ నిలిచాడు. తాజా ఛాంపియన్స్ ట్రోఫీతో కలిపి యువరాజ్ తన కెరీర్లో మొత్తం 7 ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ ఆడాడు.
ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్(6 సార్లు), శ్రీలంకకు చెందిన కుమార సంగర్కర(6 సార్లు), శ్రీలంకకు చెందిన జయవర్దనే(6 సార్లు) ఉన్నారు. కాగా, ఓవల్ వేదికగా పాకిస్ధాన్తో జరిగిన ఫైనల్లో యువరాజ్ సింగ్ అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
యువరాజ్ సింగ్ ఆడిన ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్:
1) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2000 - ఇండియా Vs న్యూజిలాండ్
2) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2002 - ఇండియా Vs శ్రీలంక
3) ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2003 - ఇండియా Vs ఆస్ట్రేలియా
4) ఐసీసీ వరల్డ్ టీ20 2007 - ఇండియా Vs పాకిస్థాన్
5) ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2011 - ఇండియా Vs శ్రీలంక
6) ఐసీసీ వరల్డ్ టీ20 2014 - ఇండియా Vs శ్రీలంక
7) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 - ఇండియా Vs పాకిస్థాన్
భారత ఆటగాళ్లలో అత్యధికంగా ఐసీసీ టోర్నమెంట్స్ ఫైనల్స్ ఆడిన ఆటగాళ్లు:
యువరాజ్ సింగ్ - 7 సార్లు
మహేంద్ర సింగ్ ధోని - 5 సార్లు
సచిన్, జహీర్ఖాన్, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ - 4 సార్లు