కోహ్లీ క్లాస్ పీకడం వల్లే!: డ్రస్సింగ్ రూమ్లో ఆసక్తికర ఘటన
హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి సెమీ ఫైనల్లో పోరుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. శ్రీలంకతో ఓడిపోయి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమిండియా సఫారీలపై అనూహ్యంగా పుంజుకోవడం వెనుక డ్రస్సింగ్ రూమ్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన కారణమని తెలుస్తోంది.

పరుష పదజాలాన్ని వాడిన కోహ్లీ
శ్రీలంకతో మ్యాచ్ ఓడిన తర్వాత జట్టులోని ఆటగాళ్లతో కోహ్లీ కాస్తంత పరుష పదజాలాన్ని వాడుతూ తన తోటి సహచర ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నాడట. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికాతో మ్యాచ్ గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వివరించాడు. కొన్నిసార్లు అవతలివాళ్లను బాధించేలా మాట్లాడైనా గెలవాల్సిందేనని కోహ్లీ అన్నాడు.

అద్భుతమైన ఫలితాన్ని చూస్తున్నామన్న కోహ్లీ
అలా ఉన్నందుకే దక్షిణాఫ్రికాతో అద్భుతమైన ఫలితాన్ని చూస్తున్నామని విరాట్ కోహ్లీ అన్నాడు. 'మీరందరూ నిజాయతీగా ఉండాలి. నేనేమైనా అంటే మీరు బాధపడతారని నాకు తెలుసు. వారి ముందు (శ్రీలంక క్రికెటర్లు) నాతో సహా మీరంతా మోకరిల్లి తప్పు చేశాం. చేసిన తప్పులను అంగీకరించాల్సిందే. ఇక ఇప్పుడు మనం నిరూపించుకోవాలి' అని కోహ్లీ అన్నాడు.

చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేయకూడదు
'కోట్ల మందిలో మనల్ని మాత్రమే ఈ స్థాయిలో ఆడేందుకు ఎంపిక చేశారన్నది గుర్తుంచుకోవాలి. దేశం కోసం చేయగలిగినదంతా చేయాలి. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేయకూడదు. ఆ శక్తి మీలో ఉంది. తిరిగి సత్తా చాటేందుకు యత్నించాలి. గతంలో చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేయవద్దు. ఐక్యంగా ముందుకు సాగి విజయం సాధించాలి' అని సహచర క్రికెటర్లతో చెప్పాడు.

కేవలం ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు రాణిస్తే చాలదు
'కేవలం ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రాణిస్తే చాలని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ చక్కగా ఆడాలని నేను కోరుకుంటున్నా' అని కోహ్లీ స్పష్టం చేశాడట. విరాట్ కోహ్లీ తీసుకున్న క్లాస్ భారత ఆటగాళ్లపై ప్రభావం చూపించడం వల్ల దక్షిణాఫ్రికాపై జట్టు సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications