హైదరాబాద్: ది ఓవల్ వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ యవరాజ్ సింగ్ ఎందుకు బౌలింగ్ వేయలేదో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. గ్రూప్ బీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియాపై శ్రీలంక 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది.
ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో టీమిండియాకు లభించిన మూడు వికెట్లలో రెండు రనౌట్లు ద్వారా లభించడం విశేషం. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడాడు. పార్ట్ టైమ్ స్పిన్ బౌలర్ యువరాజ్ సింగ్ని ఎందుకు వినియోగించుకోలేదని విలేకరుల అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.
'చూడండి, నాలుగు లేదా ఐదు వికెట్లు తీసి ఉంటే ఆ సమయంలో పార్ట్ టైమ్ స్పిన్నర్ యువరాజ్ చేత బౌలింగ్ చేయించేవాడిని. మరోవైపు 6 ఓవర్లు వేసిన జడేజా కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాట్స్ మెన్ నిలికడగా ఆడుతున్నారు. ఇలాంటి సమయంలో జడేజానే ఇబ్బంది పడ్డాడు. అలా కాకుండా యువీ అయితే మరింతగా ఇబ్బంది పడేవాడు' అని కోహ్లీ చెప్పాడు.
అయితే ధోనిని సంప్రదించిన తర్వాత కేదార్ జాదవ్కు బౌలింగ్ ఇవ్వడంపై కూడా కోహ్లీ వివరించాడు. 'ధోనితో మాట్లాడాను. మేమిద్దరం కూడా కేదార్ జాదవ్ అయితే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చాం. ఆ సమయంలో అతడే మాకు బెటర్ అని అనిపించాడు. ఇంగ్లాండ్ లాంటి వేదికలపై బ్యాట్స్ మెన్లను సీమర్ల ద్వారా ఇబ్బంది పెట్టొచ్చు' అని కోహ్లీ తెలిపాడు.
'ఆ ఉద్దేశ్యంతోనే కేదార్ జాదవ్కి బౌలింగ్ ఇవ్వడం జరిగింది. పిచ్ పరిస్థితి, మ్యాచ్ జరుగుతున్న తీరుపై అప్పటికప్పుడు ప్రణాళికలు మారుతుంటాయి. స్పిన్నర్లు పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో మనం బౌలింగ్ వేయడంలో తప్పులేదు. ఆ సమయంలో అదే సరైన నిర్ణమయని అభిప్రాయపడ్డాను' అని కోహ్లీ చెప్పాడు.
సెమీస్ ఆశలు సంక్లిష్టం: శ్రీలంక చేతిలో భారత్ ఓటమి, మ్యాచ్ హైలెట్స్
లంక చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం (జూన్ 11)న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. భారత్ తమ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే సెమీస్ చేరుతుంది. గ్రూప్ బిలో భాగంగా భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ రసవత్తరంగా మారింది.