అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైపోయింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ - పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఇదే సయయంలో తమ దేశంలో జరుగుతోన్న ఈ మెగా టోర్నీ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్ క్రికెట్ బోర్డు.. భద్రత విషయంలో భారీ ఏర్పాట్లను చేసినట్లు తెలిసింది. ఈ టోర్నీ నిర్వహణతో భద్రతకు సంబంధించి తమ దేశంపై ఉన్న అపవాదును తొలిగించుకునేందుకు భారీ బందోబస్త్ ను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం అందింది.
12వేల మంది పోలీసులు..
చివరి సారిగా 1996లో వన్డే ప్రపంచ కప్నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. అనంతరం మళ్లీ ఇప్పుడు దాదాపు 29 ఏళ్ల ఓ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనుంది. దీంతో నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది పాకిస్థాన్. లాహోర్, రావల్పిండి మ్యాచుల కోసం ఏకంగా 12వేల మందికిపైగా పోలీసులను మోహరించిందట. లాహోర్ వేదికగా మార్చి 5న జరగనున్న రెండో సెమీస్ కోసం ఏకంగా 8వేలకు పైగా భద్రత బలగాలను, రావల్పిండి మైదానం కోసం మరో నాలుగు వేల మందికిపైగా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించినట్లు అందులో రాసి ఉంది. వీరిలో 10,556 మంది కానిస్టేబుళ్లు, 1200 మంది సబార్డినేట్లు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 54 మంది డీఎస్పీలు, 18 మంది సీనియర్ అధికారులు సహా 200 మంది వరకు మహిళా పోలీసులు ఉన్నారట. ఇక తొలి మ్యాచ్కు వేదికగా ఉన్న కరాచీలోనూ భారీ సెక్యూరిటీనే పీసీబీ పెట్టిందట.

అభిమానుల కోసం చార్టర్డ్ ఫ్లైట్స్..
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది పీసీబీ. వారి కోసం ఏకంగా 9 స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లను కూడా కేటాయించింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ద్వారా వీటిని నిర్వహిస్తోంది.