ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. గతంలో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 53 శాతం ప్రైజ్ మనీని పెంచినట్లు తెలిపింది.
అత్యుత్తమ జట్లు మాత్రమే తలపడే ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మెగా టోర్నీలో పోరు హోరాహోరీగా ఆసక్తికరంగా సాగుతుంటుంది. బౌలర్లపై పైచేయి సాధించేందుకు బ్యాటర్లు, బ్యాటర్లను బోల్తా కొట్టించేందుకు బౌలర్లు తీవ్రంగా కష్టపడుతుంటారు. మొత్తంగా 8 జట్లు పోటీపడే ఈ మెగా ఈవెంట్ లో ప్రతీ టీమ్ కూడా ఈ ట్రోఫీలో విజయం సాధించాలని తీవ్రంగా పోరాడుతుంటాయి. మరి ఈ ట్రోఫీ విజేతకు ఈ సారి ప్రైజ్ మని ఎంత ఇవ్వనున్నారో అధికారికంగా ప్రకటించింది ఐసీసీ.

ప్రైజ్ మనీ వివరాలు ఇవే:
విజేత ప్రైజ్ మనీ : రూ.20.8 కోట్లు;
రన్నరప్ ప్రైజ్ మనీ : రూ.10.4 కోట్లు;
సెమీ ఫైనలిస్టు ప్రైజ్ మనీ: ఒక్కో జట్టుకు రూ. 5.2 కోట్లు;
ఐదో స్థానం, ఆరో స్థానంలో ఉన్న జట్లకు : రూ.3 కోట్లు;
ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఉన్న జట్లకు : రూ.1.2 కోట్లు;
ప్రతి మ్యాచ్ కు ప్రైజ్ మనీ : రూ.29 లక్షలు
గతసీజన్ లో ప్రైజ్ మనీ ఎంతంటే?
2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన పాకిస్థాన్ కు రూ. 14.18 కోట్లను ప్రైజ్మనీగా ఇచ్చారు. రన్నరప్ భారత్కు రూ.7 కోట్లు అందింది. సెమీస్కు అర్హత సాధించిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్కు తలో రూ.3 కోట్లు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెరో రూ.58 లక్షలు, చివరి రెండు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్కు రూ.39 లక్షలు ఇచ్చారు.