హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ కోసం వచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు జోకులేసుకుంటూ నవ్వుకుంటూ కనిపించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మైదానం బయట మంచి స్నేహితులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వీరిద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్నారు. ఐపీఎల్లో ఆడుతున్న సమయంలో ఈ ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు.

ఈ మ్యాచ్కి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా కోహ్లీ గురించి డివిలియర్స్ ఎంతో గొప్పగా చెప్పాడు. కోహ్లీ సైతం ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో డివిలియర్స్ ఒకడని, డివిలియర్స్ని సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయడమే తమ ప్రణాళిక అని ఈ మ్యాచ్కి ముందు చెప్పాడు.
అయితే ఛాంపియన్స్లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో వీరిద్దరూ ప్రత్యర్థులుగా మారారు. ఇరు జట్ల కెప్టెన్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. కానీ టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చిన సమయంలో ఇద్దరూ ఎంతో ఆహ్లాదంగా కనిపించారు.
డివిలియర్స్ జోకులేస్తే కోహ్లీ తెగ నవ్వాడు. సాధారణంగా ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం వచ్చినపుడు ఏదో మాట వరసకు మాట్లాడుకోవడం సహజమే. కానీ వీరిద్దరూ మాత్రం జోకులేసుకుంటూ.. నవ్వుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది.