హైదరాబాద్: నిత్యం వివాదాస్పద వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటుడు, రచయిత, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) మరోసారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ది ఓవల్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేఆర్కే కోహ్లీని అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించాలని ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశాడు. పాక్తో జరిగిన పైనల్లో విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపించాడు. అతడిని జైలుకు పంపాలని, భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులంతా కలిసి అతడిని వెళ్ల గొట్టాలని వ్యాఖ్యానించాడు. తక్షణమే అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించాలని బీసీసీఐకి సూచించాడు.

'సోదరా కోహ్లీ నీవు ఇచ్చిన క్యాచ్ పాకిస్థాన్ ఫీల్డర్లు వదిలేశారు. తర్వాతి బంతికే సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యావు. నువ్వు ఫిక్సింగ్కు పాల్పడ్డావని క్లియర్గా అర్థమవుతోంది. 130 కోట్ల మంది భారతీయుల ప్రతిష్టను పాకిస్తాన్కు అమ్మేసిన విరాట్ కోహ్లిపై జీవితకాల నిషేధం విధించాలి. అతడిని జైలుకు పంపాలి. కోహ్లీతో పాటు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని కూడా ఫిక్సింగ్కు పాల్పడ్డారు. మీరందరూ ఫిక్సర్లు. ప్రజలను మోసం చేయడం మానుకోవాలి' అని వరుస ట్వీట్లతో చెలరేగాడు.
ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత జట్టులోని ఆటగాళ్లపై ఆరోపణలు చేసిన కేఆర్కేపై టీమిండియా, పాకిస్తాన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఆటను ఆటలా చూడాలని, అనవసర ఆరోపణలు చేయొద్దని కేఆర్కేకి హితవు పలికారు. టోర్నీలో టీమిండియా మేటి జట్లను ఓడించి ఫైనల్ చేరిన విషయాన్ని గుర్తుంచు కోవాలలని అన్నారు.