ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి జరగాల్సి ఉంది. ఈ మెగాటోర్నీకి 75 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. కానీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఈ టోర్నీకి సంబంధించిన పనులు ముందడుగు పడట్లేదు. ఇప్పటికీ అధికారిక షెడ్యూల్ విడుదల కాలేదు.
పాకిస్థాన్కు ఎట్టిపరిస్థితుల్లో టీమిండియాను పంపించమని బీసీసీఐ స్పష్టం చేయడం, మరోవైపు కండిషన్లతో హైబ్రిడ్ మోడల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. టోర్నీ నిర్వహణపై ఐసీసీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెబుతూనే భవిష్యత్లో భారత్ ఆతిథ్యం ఇచ్చే మెగాటోర్నీలు హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతోంది.

అయితే బీసీసీఐ నిర్ణయానికి ఐసీసీతో పాటు బ్రాడ్కాస్టర్లు మద్దతు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జరగాల్సిన మొత్తం 15 మ్యాచ్ల్లో పది మ్యాచ్లను పాకిస్థాన్ వేదికగా, మిగిలిన అయిదు మ్యాచ్లను శ్రీలంక లేదా దుబాయ్ వేదికగా నిర్వహించేలా ప్రతిపాదనలు వస్తున్నాయి. కానీ, అధికారిక ప్రకటన వెల్లడి కాకపోవడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని సమర్థవంతంగా మార్కెటింగ్ చేయలేకపోతున్నామని ప్రసారకర్తలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు మెగాటోర్నీ నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగితే.. టీ20 ఫార్మాట్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వన్డే ఫార్మాట్ కంటే టీ20లకు ఆదరణ ఎక్కువ లభించనుడంటంతో.. పొట్టిఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలనే యోచనలో ఐసీసీ ఉంది.
మార్కెటింగ్ వంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా టీ20 ఫార్మాట్లో నిర్వహించేలా బ్యాకప్ ప్లాన్తో ఐసీసీ ఉంది. అయితే ఈ నిర్ణయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీతో మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనుకున్న వాళ్ల ఆశలకు బ్రేక్ పడేలా ఉంది. టీ20 వరల్డ్ కప్-2024 విజయానంతరం ఈ ఇద్దరూ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లపై దృష్టి సారించాలనే ఉద్దేశంతోనూ టీ20లకు గుడ్బై పలికారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తే.. రోహిత్-కోహ్లి బరిలోకి దిగలేరు.