హైదరాబాద్: ఆటగాళ్ల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. జూన్ 1 నుంచి 18 వరకూ ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన టోర్నీ ఇది.

ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది దేశాలు పాల్గొంటున్నాయి. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 22మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు.
దీంతో ఆటగాళ్ల భద్రతపై బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని ఆ లేఖలో పేర్కొంది. దీంతో ఐసీసీ మంగళవారం ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేసింది.
ఆటగాళ్లకి భద్రత కల్పిస్తామని, ఇందుకోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)తో కలిసి పనిచేస్తామని వివరించింది. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు జూన్ 24 నుంచి జులై 23వరకూ జరిగే ఉమెన్స్ వరల్డ్ కప్కు కూడా పూర్తిస్థాయి భద్రత కల్పిస్తున్నట్లు అందులో ఐసీసీ పేర్కొంది.
దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐసీసీ అధికారులు తెలిపారు. అమెరికా పాప్స్టార్ అరియానా గ్రాండే కన్సర్ట్ జరుగుతున్న వేదికకు అతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఆత్మాహుతి దాడిపై భారత్తో పాటు మరికొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో భాగంగా జూన్ 4న టీమిండియా తొలి మ్యాచ్లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.