హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15మందితో కూడిన భారత్ జట్టును సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. బీసీసీఐ సోమవారం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుని ప్రకటించింది. ఐపీఎల్ పదో సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా వెటరన్ ఆటగాడు గౌతం గంభీర్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికవుతాడని అభిమానులు భావించారు. అయితే గంభీర్కు సెలక్టర్లు మొండిచెయ్యి చూపించారు.
అయితే జట్టు ఎంపిక సమయంలో కనీసం గంభీర్ ప్రస్తావన ఏదీ సెలక్టర్ల మధ్య చర్చకు రాలేదని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సురేశ్ రైనా, రిషబ్ పంత్ గురించి కమిటీలో చర్చకు వచ్చినా.. కాంబినేషన్ కుదరకపోవడంతో వారిని పక్కన పెట్టాల్సి వచ్చిందని ఎమ్మెస్కే ప్రసాద్ వివరించారు.
'కుల్దీప్ యాదవ్ ప్రదర్శన గురించి సెలక్టర్ల మధ్య చర్చకు వచ్చింది. కానీ.. జట్టులో అప్పటికే అశ్విన్, జడేజా రూపంలో స్పిన్నర్లు ఉన్నారు. వారికి అదనంగా యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలరు. కాబట్టి కుల్దీప్ని ఎంపిక చేయలేకపోయాం. అలానే రిషబ్ పంత్ ఆటతీరుపై కూడా సెలక్టర్లు సానుకూలంగా స్పందించారు. కానీ.. అతడికి మరోసారి అవకాశమివ్వాలని నిర్ణయించాం. ఈ ఇద్దరు యువ క్రికెటర్లకి తప్పకుండా మంచి భవిష్యత్ ఉంటుంది. అయితే ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేయలేదు. అందుకే గంభీర్ ప్రస్తావన చర్చకు రాలేదు' అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరించారు.

ఐపీఎల్ పదో సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లాడిన గంభీర్ నాలుగు అర్ధ సెంచరీలతో మొత్తం 425 పరుగులతో టాప్-2 బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే జూన్ 1 నుంచి ఇంగ్లాండ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానె, యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.