హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి సన్నద్ధమైంది. ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకి బర్మింగ్హామ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ వేదిక టీమిండియాకు బాగా కలిసొచ్చిన వేదిక అని, కచ్చితంగా టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్కి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

'బర్మింగ్హామ్ స్టేడియంలో ఇప్పటికే టీమిండియా ఒక మ్యాచ్ ఆడింది. పిచ్ చాలా బాగుంది. భారత్ ఆటకి అది చక్కగా సరిపోతుంది. దక్షిణాఫ్రికాతో విజయం అనంతరం మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. పుంజుకునేందుకు ప్రతిచోటా అవకాశం ఉంటుంది. సెమీస్లో అభిమానుల్ని నిరాశపరచం' అని కోహ్లీ అన్నాడు.
ఇదే వేదికగా టోర్నీలో తన తొలి మ్యాచ్లో టీమిండియా.. పాకిస్థాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, లంకతో ఓటమి అనంతరం సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాని ఓడించి సెమీస్కు చేరింది.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్పై ఎలాంటి ఒత్తిడి లేదని.. అంతమాత్రానా వారిని తక్కువ అంచనా వేయడం లేదని కోహ్లీ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్ చేరినా బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే పైనల్లో పాక్ను ఢీకొట్టనుంది. ఆటపరంగా, రికార్డులపరంగా బంగ్లాకు అందనంత ఎత్తులో టీమిండియా ఉంది. అయితే టెస్టు, టీ20లతో పోలిస్తే వన్డే ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.