లండన్: పాకిస్థాన్ వీరాభిమాని చికాగో చాచా(మొహమ్మద్ బషీర్) భారత అభిమానిగా మారిపోయాడు. పాకిస్థాన్-ఇండియా మ్యాచ్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా.. స్టాండ్స్లో అతను వాలిపోతాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా-పాక్ మ్యాచ్లో ఎవరు ఫేవరెట్ అని అడిగితే.. కచ్చితంగా ఇండియానే అని తడుముకోకుండా చెప్పేశాడు.
అంతేగాక, తన మద్దతు కూడా ఈసారి టీమిండియాకే అని తేల్చేశాడు. అసలు విరాట్సేనతో పోటీపడే సత్తా పాక్కు ఎక్కడుందని ఈ చికాగో చాచా అంటున్నాడు. 'అందరూ అనుకున్నట్లుగా ఇండో-పాక్ మ్యాచ్లో పోటీ ఎక్కడుంది? పాక్తో పోలిస్తే ఆటపరంగా భారత్ ఎంతో ముందుంది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియానే గెలుస్తుంది' అని చెప్పేశాడు.

భారత్లో ధోనీ, కోహ్లీ, యువరాజ్లాంటి పెద్ద స్టార్లు ఉంటే పాక్లో ఎవరున్నారు? అని బషీర్ ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 4న బర్మింగ్ హోమ్లో జరగనున్న ఇండియా-పాక్ మ్యాచ్ ఫలితాన్ని కూడా బషీర్ ముందే చెప్పేశాడు. 'వార్ వన్ సైడే' అని స్పష్టం చేశాడు.
అయితే, బషీర్ వ్యాఖ్యలను పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, 2011 వరల్డ్కప్ నుంచి భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ జరిగినా తప్పకుండా హాజరయ్యే చాచా ఈసారి రంజాన్ సందర్భంగా మక్కా వెళ్లాడు. దీంతో ఈ మ్యాచ్ను చూడలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్లోని కరాచీకి చెందిన మొహమ్మద్ బషీర్.. అమెరికాలోని చికాగోలో రెస్టారెంట్ యజమానిగా స్థిరపడ్డాడు. 2011 నుంచి ఇండియా పాకిస్థాన్ ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్లకు హాజరై తనదైన శైలిలో సందడి చేస్తూ ఇరుదేశాల నుంచి అభిమానం పొందాడు. అయితే, అతని తాజా వ్యాఖ్యలు సగదు పాక్ అభిమానికి చేదుగానే ఉండనున్నాయి.
'నిన్ననే సుధీర్ చైదరి(సచిన్ టెండూల్కర్ వీరాభిమాని) ఫోన్ చేసి 'మ్యాచ్ కు వస్తున్నావా?' అని అడిగాడు. పరిస్థితి వివరించి రావడం లేదని చెప్పా' అని బషీర్ తెలిపాడు. సౌదీ అరేబియాలో క్రికెట్ మ్యాచ్లు కూడా ప్రసారం కావని, అయితే, తాను మాత్రం ఇంటర్నెట్ ద్వారా వీక్షిస్తానని తెలిపాడు. కాగా, ఎప్పటి నుంచో పాక్ టీమ్కు మద్దతు తెలిపినా.. బషీర్కు ఎంఎస్ ధోనీ అంటే చాలా ఇష్టం. పాక్ టీమ్ కంటే ఎక్కువగా అతను ధోనీకే అభిమాని అంటే ఆశ్చర్యం లేదు.