Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతుందని కూడా ఖరారైంది. న్యూజిలాండ్ జట్టు సెమీస్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెమీ-ఫైనల్స్ కోసం నాలుగు జట్లు ఖరారు కాగానే.. ఆసక్తికరమైన అంచనాలు నెలకొన్నాయి. దాదాపు పదేళ్ల క్రితం 50 ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్ లో కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఈ నాలుగు జట్లే అప్పుడు కూడా సెమీస్ కు చేరుకున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు.. ఇప్పుడు జరిగినట్లే వన్డే ప్రపంచకప్ కూడా ఇలాగే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా భారత్తో తలపడనుండగా.. రెండో సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికా న్యూజిలాండ్ తో తలపడుతుంది. ఈ నాలుగు జట్లు చివరిసారిగా 2015 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డాయి. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ లో ముఖాముఖి తలపడుతున్నాయి.

2015లో జరిగిందిలా..
2015 వన్డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు సెమీ ఫైనల్ లో టీమిండియాను ఓడించింది. కాగా న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. తర్వాత ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్టును ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇటీవల 2023 ప్రపంచ కప్లో కూడా ఈ నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ లో తలపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అప్పుడు కూడా ఆస్ట్రేలియా ఆ టోర్నమెంట్ టైటిల్ ను గెలుచుకుంది. మరి ఈ సారి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
ICC POSTER FOR CHAMPIONS TROPHY SEMIS...!!!!
— Johns. (@CricCrazyJohns) March 2, 2025
- All the best, Rohit & his team 🇮🇳 pic.twitter.com/XqM8tJckFR
టీమిండియా ఆశలు
ఎలాగైనా ఈ సారి టైటిల్ ను గెలుచుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇది వన్డే ఫార్మాట్ టీమిండియాకు చివరి ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం. దీని తర్వాత టీమిండియా నేరుగా 2024 టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. కానీ ఇప్పటివరకు గత 12 ఏళ్లలో టీమిండియా 50 ఓవర్ల ఫార్మాట్ లో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.