భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా అవతరించింది. శ్రీలంకలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ జట్టుపై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 197 పరుగుల స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 118 పరుగులకే కుప్పకూలింది.
యోగేంద్ర భదోరియా విధ్వంసం
ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత ప్లేయర్ యోగేంద్ర భదోరియా అద్భుత ప్రదర్శన చేశాడు. 40 బంతుల్లోనే నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 73 పరుగులు సాధించాడు. భారత బౌలర్లు కూడా అదిరే ప్రదర్శన చేశారు. రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులు సమర్పించుకుని 4 వికెట్లు పడగొట్టగా... కెప్టెన్ విక్రాంత్ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులు సమర్ఫించుకుని 2 వికెట్లు తీశాడు. రవీంద్ర సంటే 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

ఈ విజయం గురించి తెలుపుతూ.. భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) తమ సోషల్ మీడియా అధికార అకౌంట్ ఎక్స్ ద్వారా హర్షం వ్యక్తం చేసింది. కృషి, దృఢ సంకల్పం, నైపుణ్యం కలగలిపిన అసాధారణ ప్రదర్శన అంటూ ప్రశంసలు కురిపించింది.

ఈ మెగా టోర్నీలో విక్రాంత్ కేనీ, భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవరించాడు. "జట్టును విజయపథంలో నడిపించడం నా కెరీర్కు గర్వకారణం. ప్లేఆఫ్లో మా ప్రయాణం జట్టులోని ప్రతిభ, పోరాట స్ఫూర్తిని చూపిస్తుంది. జట్టులోని ప్రతి ప్లేయర్ ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడ్డారు. ఈ విజయం భారత్ లో క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి అంకితం" అని విక్రాంత్ కేనీ అన్నాడు.