ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అప్ఘానిస్థాన్ జట్టు అంచనాలకు మించి అదరగొడుతోంది. ఆటగాళ్లు ఎంతో అనుభవజ్ఞుల్లా ఆడుతున్నారు. ఈ టోర్నీలోని తమ రెండో మ్యాచ్లోనే అగ్రజట్టు ఇంగ్లాండ్ ను ఓడించిన అప్ఘాన్లు.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న కీలక మ్యాచ్ లో అదిరే ప్రదర్శన చేశారు. దీంతో ఆస్ట్రేలియా ముందు 274 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది అప్ఘానిస్థాన్. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
వాస్తవానికి తొలి ఓవర్లోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (0) వికెట్ కోల్పోవడంతో అప్ఘాన్ కు మంచి శుభారంభం దక్కలేదు. కానీ ఆ తర్వాత నుంచి ఆటగాళ్లు మంచిగానే రాణించారు. అప్ఘానిస్థాన్ బ్యాటర్లలో సెదీఖుల్లా అటల్ (95 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 85 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కాసేపు ఆడుకున్నాడు. ఇబ్రహీం జద్రాన్ (28 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 22 పరుగులు), హష్మతుల్లా షాహిది (49 బంతుల్లో 20) నామమాత్రపు పరుగులు చేశారు. చివర్లో అజ్మాతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్ ల సాయంతో 67) విజృంభించి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 270 పరుగులు దాటించాడు. మిగతా వారు విఫలమయ్యారు. చివరి వికెట్ గా నూర్ అహ్మద్ (6) వెనుదిరిగాడు.
