ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కథ క్లైమాక్స్కు చేరింది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఏర్పాట్లన్నీ చకచకా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ పిచ్ గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. దీని గురించి స్టేడియం నిర్వహకులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఫైనల్ మ్యాచ్ కోసం.. సెమీ ఫ్రెష్ పిచ్ సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ పిచ్ ఇప్పుడెలా ఉండబోతుందా అని తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది? ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? భారత్ విజయావకాలు ఎలా ఉన్నాయి? ఇంతకుముందు ఆ పిచ్ పై ఎవరెలా రాణించారు?, స్కోర్లు ఎంత నమోదయ్యాయి? అని విశ్లేషణలు ఇస్తున్నారు.

సెమీ-ఫ్రెష్ పిచ్ అంటే?
ఫైనల్ కోసం లీగ్ స్టేజ్ లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు ఉపయోగించిన పిచ్ నే సిద్ధం చేసినట్లు తెలిసింది. అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తన అన్ని మ్యాచులన్నింటినీ దుబాయ్ స్టేడియం వేదికగా ఆడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలో మొత్తం పది పిచ్ లు ఉన్నాయి. అన్నీ దాదాపుగా స్పిన్నర్లుకు అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఇప్పటివరకు భారత్ ఆడిన నాలుగు మ్యాచులకు నాలుగు పిచ్ లను తయారు చేశారు. అయితే ఇప్పుడు ఫైనల్ కోసం లీగ్ స్టేజ్ లో జరిగిన భారత్ పాక్ మ్యాచ్ కు ఉపయోగించిన పిచ్ ను ఉపయోగించనున్నారు. దీనిని 'సెమీ-ఫ్రెష్' పిచ్ అని అంటారు. అంటే ఈ పిచ్ పై చివరి 14 రోజుల క్రితం మ్యాచ్ (భారత్ పాక్) ఆడారన్న మాట. అందుకే దీనిని సెమీ-ఫ్రెష్ పిచ్ అని పిలుస్తున్నారు.
ఈ సెమీ ఫ్రెష్ పిచ్ కూడా దాదాపు స్పిన్నర్లుకు అనుకూలంగానే ఉంటుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్ 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిగా.. భారత్ దానిని ఆరు వికెట్ల తేడాతో ఛేదించి గెలిచింది. ఈ పోరులో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి 40 పరుగులు సమర్ఫించుకుని, మూడు వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎనిమిది ఓవర్లలో 31 పరుగులకు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మగితా స్పిన్నర్లు అక్షర్ పటేల్, జడేజా 26 ఓవర్లలో 129 పరుగులు సమర్పించుకుని ఐదు వికెట్లు తీశారు. భారత్ ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీ బాదగా, శ్రేయస్ అయ్యర్ 56 హాఫ్ సెంచరీ, గిల్ 46 బాదారు.